సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ మహాప్రస్థానం తరహాలో పంజాగుట్ట శ్మశానవాటికను తీర్చిదిద్దారు. ఇదే విషయాన్ని ఆదివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ శ్మశాన వాటిక కొత్త సొబగులు, పచ్చందాలతో సరికొత్తగా సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫోనిక్స్ ఫౌండేషన్ సుమారు రూ.3 కోట్ల వ్యయంతో ఈ వైకుంఠ మహాప్రస్థానం నిర్మాణం చేపట్టింది.
విద్యుత్ దహన వాటికను, వీవీఐపీ దహన వాటికను పక్కపక్కనే నిర్మించారు. ఇందులో ప్రత్యేక గదులతో పాటు స్నానపు గదులు, ఇతరత్రా మంచినీటి సౌకర్యాలు కల్పించారు. పర్యావరణానికి పెద్ద పీట వేయడంతో పాటు రంగు రంగుల పూలమొక్కలు, పచ్చని లాన్, చుట్టూ చెట్లతో ప్రకృతిని కాపాడుకుంటూనే ఆవరణకు అదనపు శోభను చేకూర్చారు. మహా ప్రస్థానం తరహా పంజాగుట్ట శ్మశానవాటికను తీర్చిదిద్దినట్లు ఫోనిక్స్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలిపారు.