బేగంపేట్/సుల్తాన్బజార్, జూన్ 4: సికింద్రాబాద్ మహంకాళి, సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ల పరిధిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన బాబు, ఓ పాప కిడ్నాప్ కేసులు లష్కర్లో కలకలం రేపాయి. చిన్నారుల కిడ్నాప్ కేసులను ఛాలెంజ్గా తీసుకున్న ఉత్తర మండలం పోలీసులు.. కేవలం రెండు గంటల్లోనే ఛేదించారు. మహంకాళి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాప, బాబులను వారివారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ చందనా దీప్తి వెల్లడించారు. కర్ణాటకకు చెందిన మేఘరాజ్ భార్యా పిల్లలతో కలిసి సికింద్రాబాద్ ప్యారడైజ్ దాదూస్ మిఠాయి షాపు వద్ద ఫుట్పాత్పై ఉంటూ అక్కడే బెలూన్స్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు.
మేఘరాజ్కు ఏడుగురు సంతానం. అందులో ఐదుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కాగా, ఆదివారం తెల్లవారు జాము 3.30 గంటల సమయంలో మేఘరాజ్ అలియాస్ కాళి తన కుటుంబ సభ్యులతో కలిసి ఫుట్పాత్పై నిద్రిస్తుండగా.. గుర్తు తెలియని ఓ వ్యక్తి, మహిళ అటోలో వచ్చి చిన్నారి కరిష్మా (3)ను కిడ్నాప్ చేసి అక్కడి నుంచి పారిపోయారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి గమనించి.. చిన్నారి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అక్కడి నుంచి వెళ్లిన నిందితులు ఎంజీ రోడ్డు మీదుగా ట్యాంక్బండ్ వైపు పారిపోయారు. అనంతరం పాప తల్లిదండ్రులు 4.20 గంటల సమయంలో మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు.
సుల్తాన్బజార్లో మరో బాలుడు..
సికింద్రాబాద్ నుంచి ఆటోలో పారిపోయిన నిందితులు .. సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో ఫుట్పాత్పై కుటుంబ సభ్యులతో నిద్రిస్తున్న ఏడు నెలల బాబు శివకుమార్ను కూడా అపహరించారు. బాబు తల్లి వెంటనే సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం రంగంలోకి దిగి సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులు తిరిగి ప్యారడైజ్ వైపు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు.. ఈ సమాచారాన్ని మహంకాళి పోలీసులకు అందజేశారు.
రెండు గంటల్లోనే..
ఫిర్యాదు అందుకున్న మహంకాళి పోలీసులు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్లు కావేటి శ్రీనివాస్, నాగేశ్వర్రావు తన బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఆటోలో వెళ్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి చిన్నారులను సురక్షితంగా రక్షించి.. వారివారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇద్దరు చిన్నారులను రెండు లక్షలకు విక్రయించేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉన్నదని, విచారణలో మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. సుల్తాన్బజార్, మహంకాళి పోలీసులకు చిన్నారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వీరే నిందితులు
ఫలక్నుమా ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ (36) ఆటో డ్రైవర్. నిజామాబాద్కు చెందిన పర్వీన్ అలియాస్ షభానా (30) గృహిణి. సికింద్రాబాద్లోని ఓ ప్రాంతంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరు ఓ ముఠాగా ఏర్పడి.. ఈ కిడ్నాప్లకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. పర్వీన్కు మూడు నెలల బాబు ఉన్నాడని, ఆమె సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో నిద్రిస్తుండగా బాబును ఎవరో ఎత్తుకుపోయినట్టు ఇమ్రాన్కు తెలిపింది. బాబు అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితులిద్దరికీ నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఓ దొంగతనం కేసులో ఇమ్రాన్ నిందితుడని, అన్ని కోణాల్లో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.