దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని గురువారం తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజిద్ ఆధ్వర్యంలో ప్రతినిధులు సీఎండీకి పుష్పగుచ్ఛం అందజేసి.. నూతన సంవత్సర
శుభాకాంక్షలు తెలిపారు.
సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ యాజమాన్యానికి ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఉచిత బస్సు సౌకర్యంలో మహిళలందరూ ప్రైవేటు వాహనాలు వీడి, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళా ప్రయాణికులతో కిటకిట లాడుతుండటంతో ప్రయాణికులతో పాటు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితులు తీసుకురావాలంటే.. తక్షణమే అదనపు బస్సులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఆర్టీసీకి రానే వచ్చింది.
గ్రేటర్ జోన్ అవసరాలకు అనుగుణంగా 1000 బస్సులు కొత్తగా కొనుగోలు చేస్తే ఆ బస్సులకు అనుగుణంగా అదనపు డ్రైవర్లు, కండక్టర్ల నియామకం జరగాల్సి ఉంది. ప్రస్తుతం నగరంలో కేవలం 2400 బస్సులకు సరిపడా డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే ఉన్నారు. అంటే కొత్త బస్సులు కొనాలంటే ఆ బస్సులు వచ్చేలోగా కొత్తగా నియామకాలు పూర్తి చేయాలి. ఒక వేళ కొత్త బస్సులు తెస్తే.. దానికి సరిపడే విధంగా అంటే దాదాపు 5వేల వరకు డ్రైవర్లు, కండక్టర్ల నియామకం తక్షణం చేపట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆర్టీసీ అధికారులలో కొందరు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది.
గ్రేటర్ పరిధిలో తిరుగుతున్న 2700 బస్సులు సరిపోవడం లేదు. ప్రస్తుతం ఉన్న వాటిలో 1000 బస్సుల వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. ప్రస్తుత రద్దీకి అనుగుణంగా గ్రేటర్లో 4వేల బస్సులు నడపాల్సి ఉండగా.. కాలంచెల్లిన బస్సులను తీసేస్తే.. కేవలం 1700 బస్సులు మాత్రమే ఆర్టీసీకి ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. అంటే మరో 2300 బస్సులు అవసరం ఉండగా.. వాటిని కొత్తగా కొనుగోలు చేయాలా..? లేదా ప్రైవేటు అద్దె బస్సులను సేకరించాలా..? అన్న అంశంపై చర్చలు జరుగుతున్నాయి.
గ్రేటర్ పరిధిలో కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తుది ఆమోదం లభించాల్సి ఉంది. అప్పటివరకు 340 అద్దె బస్సులను నడిపించాలని అర్టీసీ అధికారులు నిర్ణయించి టెండర్లు పిలువగా కేవలం 50 బస్సులకు మాత్రమే ప్రైవేటు ఓనర్లు టెండర్లు దాఖలు చేశారు. మిగిలిన 290 బస్సుల కోసం ఆర్టీసీ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. తమ షరతులను ఒప్పుకుంటే అద్దె బస్సులు ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రైవేటు అద్దె బస్సు యాజమాన్యాల సంక్షేమ సంఘం నాయకులు ఇప్పటికే తెలిపినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ఆ దిశగా ముందుకు రావడం లేదని తెలుస్తున్నది.
తెలంగాణ టెక్నికల్ సర్వీసెస్ ఎండీగా నియమితులైన శంకరయ్య గురువారం కమిషనర్ రొనాల్డ్ రాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
– సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ)