సిటీబ్యూరో/ఎర్రగడ్డ, జూన్ 4 : బోరబండలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబాన్ని బుధవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడు గౌసుద్దీన్తో కలిసి కృష్ణారావు సర్దార్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. పార్టీకి సర్దార్ చేసిన సేవలను బీఆర్ఎస్ ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. సర్దార్ కుటుంబానికి అన్యాయం చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బోరబండ డివిజన్లో బాబా అక్రమ వసూళ్లు అరాచకాలు గమనించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆయనను దూరం పెట్టారని కృష్ణారావు పేర్కొన్నారు.
‘సర్దార్ ఆత్మహత్య వెనుక బోరబండ డివిజన్ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వేధింపులే ప్రధాన కారణం.. కానీ బాబాను పోలీసులు ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదు. పైగా ఆయన ఇంటి చుట్టూ బారికేడ్లు, పోలీసు భద్రత’.. అంటూ ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాను అరెస్టు చేయని పక్షం లో బోరబండ పీఎస్ ఎదుట ధర్నాకు వెనుకాడేది లేదని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని బల్దియా అధికారులతో బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ను కూల్చేయించటం కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ‘50 గజాల్లో పేద వాడు ఇల్లు కడుతుంటే.. బల్దియా అధికారులు అక్కడ వాలుతున్నారు.. అదే అయ్యప్ప సొసైటీలో 10-15 ఫ్లోర్లను అనుమతి లేకుండా నిర్మిస్తుంటే అధికారులకు కనపడదు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఉత్సాహం ప్రదర్శించే అధికారులు అప్పుడు మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.