ఆటోలో మొబైల్ను మరిచిపోయిన దంపతులు
అందులో విలువైన సమాచారం ఉండటంతో కలవరపాటు
మాదాపూర్ పీఎస్లో బాధితుల ఫిర్యాదు
టెక్నాలజీతో ఫోన్ను వెతికిపెట్టి.. అప్పటికప్పుడే అప్పగించిన పోలీసులు
సిటీబ్యూరో, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): ఓ సెల్ఫోన్ అదృశ్యం ఆ దంపతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. వారు పరుగు పెట్టి.. మాదాపూర్ పోలీసుల సాయాన్ని ఆర్జించగా, సాంకేతిక పరిజ్ఞానంతో వెతికి పెట్టి.. ఆ చరవాణిని బాధితులకు అప్పటికప్పుడే అప్పగించారు. ఇందుకోసం ఏకంగా పది సీసీ కెమెరాల ద్వారా అన్వేషించడం విశేషం. కొండాపూర్ ప్రాంతానికి చెందిన దంపతులు శనివారం ఉదయం ఏడు గంటల సమయంలో మెడికవర్ దవాఖానకు వచ్చారు. అక్కడ వైద్యులను కలిసిన అనంతరం ఇద్దరు తిరిగి ఆటోలో ఇంటికి వెళ్లారు. అయితే తమ మొబైల్ ఫోన్ కనిపించలేదు. అందులో వారు పని చేసే సంస్థకు సంబంధించిన కీలక సమాచారం ఉండటంతో హైరానా పడ్డారు. వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో ఎక్కామని.. నంబర్ తెలియదని చెప్పారు. వెంటనే పోలీసు అధికారులు కమ్యూనిటీ సీసీ కెమెరాల ఆధారంగా మెడికవర్ దవాఖాన నుంచి దంపతుల నివాసం వరకు పది సీసీ కెమెరాలను పరిశీలించారు. వారు ప్రయణించిన ఆటోను గుర్తించి.. డ్రైవర్ను సంప్రదించారు. అతడు ఆటోను తనిఖీ చేయగా, సీటుపై ఫోన్ కనిపించడంతో పోలీస్స్టేషన్లో అందజేశాడు. పోలీసులు ఫోన్ను ఆ దంపతులకు అప్పగించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పోలీసుల మేలు మర్చిపోమంటూ.. వారికి కృతజ్ఞతలు చెప్పారు.