శేరిలింగంపల్లి, జూన్ 30: ఖరీదైన బీఎండబ్ల్యూ కార్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని మాదాపూర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రెండు ఖరీదైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ కె.శిల్పవల్లి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. బైరెడ్డి అరుణ్రెడ్డి(29)ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు నిమిత్తం నగరానికి వచ్చి గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలో ఉంటున్నాడు. వెబ్ డిజైనింగ్లో శిక్షణ పొందిన అరుణ్రెడ్డి కొంతకాలం వెబ్ డిజైనర్గా పనిచేసి మానేశాడు. ఖరీదైన కార్లలో తిరగడం, అందులోనూ బీఎండబ్ల్యూ కార్లంటే ఎంతో ఇష్టం. దీంతో కార్లు దొంగిలించడం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో గతేడాది మే నెలలో జీరో-40 పబ్కు వెళ్లాడు. అక్కడ నార్సింగి ప్రాంతానికి చెందిన రాజశేఖర్ రెడ్డి కుమారుడు వాలెట్ పార్కింగ్కు ఇచ్చిన బీఎండబ్ల్యూ ఎక్స్5 వాహనానికి తానే యజమానినంటు సెక్యూరిటీ సిబ్బందిని నమ్మించి సదరు కారుతో ఉడాయించాడు. కారు నంబర్ ప్లేట్ మార్చి జల్సాచేయడం ప్రారంభించాడు. జూన్ 24న గచ్చిబౌలి బౌల్డర్హిల్స్లో ఓ బాలీవుడ్ సింగర్ మ్యూజికల్నైట్ ఉండటంతో అక్కడకు వెళ్లిన అరుణ్రెడ్డి.. కొండాపూర్కు చెందిన మనోజ్ఞను తాను వాలెట్ పార్కింగ్ మనిషినంటు నమ్మించి పార్కింగ్ చేస్తానని చెప్పి బీఎండబ్ల్యూ జెడ్4 కారు తీసుకొని ఉడాయించాడు.
బాధితురాలు మనోజ్ఞ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీకి గురైన సదరు కారు గచ్చిబౌలిలోని షెర్టన్ హోటల్ పార్కింగ్లో ఉన్నట్లు గుర్తించారు. కారుపై నిఘా పెట్టిన పోలీసులు.. రెండు రోజుల తర్వాత కారును తీసుకెళ్లేందుకు వచ్చిన అరుణ్రెడ్డిని పట్టుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకున్నాడు. కారును స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో గతంలో దొంగిలించిన మరో బీఎండబ్ల్యూ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అరుణ్రెడ్డిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో మాదాపూర్ అడిషనల్ డీసీపీ నంద్యాల నర్సింహారెడ్డి, క్రైమ్స్ అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.