Hyderabad Metro | సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): నగరంలో మెట్రో ప్రయాణికులకు కొత్త ఆఫర్ను ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ సంస్థ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్ అందుబాటులోకి వస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ, సీఈఓ కేవీబీ రెడ్డి తెలిపారు. ఆఫ్ పీక్ అవర్స్ ఆఫర్లో భాగంగా కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్స్(సీఎస్సీ)లపై 10 శాతం రాయితీ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు తిరిగి రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ఆఫర్ను అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో 57 మెట్రో స్టేషన్లతో కలిసి మొత్తం 69 కి.మీ మేర మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రతి రోజు 4.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నామరని ఆయన తెలిపారు.
ఇప్పటి వరకు మెట్రోలో అమలులో ఉన్న సూపర్ సేవర్ ఆఫర్ రూ.59 నుంచి రూ. 99ధర పెంచినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న ఈ ఆఫర్ మార్చి 31,2023తో ముగిసిందని, దీన్ని ఏప్రిల్ 1, 2023 నుంచి సూపర్ సేవర్ ఆఫర్ రూ.99గా మార్చినట్లు తెలిపారు. ఈ ఆఫర్లో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే మెట్రోలో ప్రయాణించాల్సి ఉంటుందని, ఒక్క రోజు కు రూ.99 ఉంటుందని, సెలవు రోజులకు సంబంధించిన సమాచారం ఆన్లైన్తో పాటు అన్ని మెట్రో స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గతేడాది అందుబాటులో ఉన్న సూపర్ సేవర్ ఆఫర్ రూ.59తో 10లక్షలకు పైగా ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారని కేవీబీ రెడ్డి తెలిపారు.అదేవిధంగా గతంలో కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డులు, డిజిటల్ క్యూర్ కోడ్లు ఉపయోగించి కొనుగోలు చేసే టికెట్లపై ప్రకటించిన 10 శాతం రాయితీని ఉపసంహరించుకున్నామని వివరించారు.