ఇప్పటికే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో సామాన్యులు సతమతమవుతుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. మరోసారి తన మార్క్ పాలనను చూపించింది. గృహిణులు మొదలు వ్యాపారులు, వినియోగదారులకు పిడుగులాంటి వార్త. తరచూ గ్యాస్ సిలిండర్ల ధర పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న మోదీ సర్కారు… ఈ సారి మళ్లీ గ్యాస్ ధరలు పెంచింది. రూపాయి, పది రూపాయలు కాదు… డొమెస్టిక్ సిలిండర్పై రూ.50 తో పాటు కమర్షియల్ సిలిండర్పై ఏకంగా రూ.350.50 పెంపుదలతో వంటింట్లో మంటపెట్టింది.
ఒకవైపు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు గతంలో కంటే తక్కువగా ఉన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచి ప్రజలకు గుదిబండగా మార్చింది. దీంతో సామాన్య కుటుంబాలు తిరిగి కట్టెల పొయ్యిలను ఆశ్రయించే పరిస్థితి వచ్చింది. కమర్షియల్ సిలిండర్ల ధర పెంపుతో నేటి నుంచి చాయ్ మొదలు… హోటళ్లలో టిఫిన్లు, భోజనం, బిర్యానీ ఇలా ఒకటేమిటి.. మునుపటికంటే నోట్లోకి భారంగా ముద్ద దిగాల్సిన పరిస్థితి నెలకొంది.
భారీగా గ్యాస్ ధరలు పెంచడంతో వినియోగదారులు సైతం భగ్గుమంటున్నారు. ముఖ్యంగా గృహిణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైందని, పేదల బతుకులను చిందరవందర చేస్తున్నదని మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ ప్రధానిగా వస్తేనే క్లిష్ట పరిస్థితిలో ఉన్న దేశం దశ మారుతుందని, అన్ని రంగాలు బాగుపడుతాయని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సిలిండర్ ధరల పెంపుపై సిటీలో భారీ ఎత్తున నిరసనలు తెలుపాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు 3న జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్టీ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు.
సామాన్యుడికి ఉరి బిగిస్తున్న కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో సామాన్యుడికి ఉరి బిగిస్తోంది. మోదీ రాక ముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర రూ.1155 కి చేరింది. కేంద్రం తీరు పేదలను మళ్లీ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నాయి. బీజేపీ పాలనలో వంట గ్యాస్ ఒక్కటే కాదు నూనె, పప్పులు, ఉప్పులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో సామాన్యుడు సరుకులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కార్మిక, కర్షక, పేద, మధ్య తరగతి ప్రజలపై రాక్షసత్వం ప్రదర్శిస్తున్న కేంద్రం తీరును బీఆర్ఎస్ తరఫున కండిస్తున్నాం. పెంచిన ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలి.
– చామకూర మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి
దేశాన్ని గాడిలో పెట్టే నాయకుడు కేసీఆరే
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వంట నూనె, తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచింది. దీనికి తోడు మరోసారి గ్యాస్ ధర రూ.50 రూపాయలు పెంచింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. దమ్మున్న నాయకుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని అయితేనే ధరలు తగ్గి, దేశంలోని అన్ని రంగాలు బాగుపడుతాయి. దేశ దిశను మార్చడానికి ఆయన ప్రధాని కావాలి.
– కె.అనురాధ(కాచిగూడ)
కార్పొరేట్లకు పట్టం.. ప్రజలకు కష్టం
కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ సంస్థలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదు.పని తక్కువ ప్రచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలతో జేబులకు చిల్లు పడుతోంది. దీనికితోడు నిత్యావసర వస్తువులపై జీఎస్టీల పేరుతో బాదుతున్నారు. ఇప్పుడేమో గ్యాస్ సిలిండర్పై మళ్లీ రూ.50 పెంచి మరింత భారం మోపారు.ఇదెక్కడి న్యాయం పాలకులే చెప్పాలి. ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం మంచిదికాదు.
– వి.శేఖర్, వ్యాపారి, చాంద్రాయణగుట్ట
ఇలా ధరలు పెంచితే బతికేదెట్ల..
రోజు రోజుకు గ్యాస్ ధరలు పెంచుకుంటపోతే ఎట్లా బతకాలి. గతంలో రూ.500 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు రూ. 1155 అయ్యింది. ఇట్లా ప్రతీసారి రూ.50 పెంచితే ఎట్ల. గత ప్రభుత్వాలు ఎప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇట్లా పెంచలేదు. కూలీ పని చేసుకుంటూ బత్కేటోళ్లం. మళ్లీ కట్టెల పొయ్యిల కాడ వండుకునే రోజులు వస్తున్నాయి. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి. – నందిగామ వెంకటమ్మ, కోళ్లపడకల్, మహేశ్వరం
అన్నింటికీ ధరలు పెంచారు..
ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బందులు పడుతున్నాం.ఇదివరకే అనేకసార్లు గ్యాస్ ధరలు పెంచారు. ఇప్పుడు మళ్లీ రూ.50 పెంచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. అన్నింటి ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. డీజిల్, పెట్రోల్ ధరలు కూడా పెంచారు. మా జీతాలు మాత్రం పెరగడం లేదు. మేము ఎట్లా బతకాలి.పెంచిన ధరలను కేంద్రం తగ్గించాలి . – హెచ్.లక్ష్మి, గృహిణి, చిక్కడపల్లి
ఓటుతోనే సమాధానం చెబుతాం
కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు ధరలు పెంచుతున్నది. ఏం కొనకుండా, తినకుండా చేస్తోంది. పేదల కోసం ధరలను అదుపులో ఉంచుతామని ఎన్నికల ముందు చెప్పిన బీజేపీ నాయకులు ఇప్పుడు ముఖం కూడా చూపెడతలేరు. మోదీ గవర్నమెంట్ టీవీల్లో ఉపన్యాసాలు తప్పా పేదలకు చేసిందేమీ లేదు. ప్రతి వస్తువుపై ధరలు పెంచితే సామాన్యులం ఎలా బతకాలి. ఇక ముందు ధరలను పెంచుకుంటూ పోతున్న పార్టీలకు ఓటుతోనే సరైన బుద్ధి చెబుతాం.
– కె.వినోద, గృహిణి, తెలుగు యూనివర్సిటీ
గ్యాస్ ధర తగ్గించాలి
డొమెస్టిక్ గ్యాస్ ధర పెరిగింది. రోడ్లపై చాయ్ అమ్మేవారి కోసమైనా గ్యాస్ ధర తగ్గించాలి. రోడ్డుపై టీస్టాల్ నడిపేవారికి ఎన్నో కష్టాలు ఉంటాయి. దానికి తోడు గ్యాస్ ధరపెరగడంతో వచ్చే ఆదాయానికి గండి పడుతుంది. దేశ ప్రధాని మోదీ కనీస ఆలోచన లేకుండా పెంచుతున్నారు.
– పరశురాం, టీస్టాల్, శ్రామికనగర్, గౌతంనగర్
కేంద్రం తీరును ఎండగట్టాలి
మోదీ సర్కార్ పెంచుతున్న ధరలకు బతుకులు చిన్నాభిన్నమవుతున్నాయి. నిత్యం చమురు ధరలు పెంచుతుండగా, గ్యాస్ ధర పెంపుతో బండ ఇక గుదిబండగా మారనున్నది. కేంద్రం పెంచుతున్న ధరలకు కళ్లెం పడితేనే నిత్యావసర ధరల పెంపు తగ్గుతుంది. అన్ని రంగాల ప్రజలు ఉద్యమించి కేంద్ర సర్కారు వైఖరిని ఎండగట్టాలి.
– సుజాత, టీచర్, మూసాపేట