రామదూత.. అతులిత బలధామా!
హనుమంతుడి నామ స్మరణతో
నగరంలో ఆధ్యాత్మిక సందడి
గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు భక్తజన ర్యాలీ
సజావుగా సాగిన హనుమాన్ శోభాయాత్ర
భక్తజన సందోహం నడుమ విజయవంతంగా
హనుమాన్ జయంత్యుత్సవం
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర.. జయ కపీశ తిహు లోక ఉజాగర.. రామదూత అతులిత బలధామా.. అంజని పుత్ర పవన సుత నామా.. అంటూ హనుమాన్ చాలీసాలతో, పారాయణలతో శనివారం నగరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొన్నది. హనుమజ్జయంతిని పురస్కరించుకొని ఆంజనేయ స్వామి గుడులకు నగరవాసులు పోటెత్తారు. స్వామికి అర్చనలు చేశారు. ఆకుపూజలతో ఆరాధించారు. మరోవైపు గౌలిగూడ నుంచి తాడ్బండ్ వరకు 12 కిలోమీటర్ల వరకు శోభాయాత్ర ప్రశాంతంగా సాగింది. వేలాది మందితో సాగిన ఈ యాత్రకు నగరం నలువైపుల నుంచి పలు ఊరేగింపులు తోడయ్యాయి. 8 వేల మంది పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి ఏ చిన్న అవాంఛనీయ ఘటనకు ఆస్కారం లేకుండా యాత్ర సజావుగా సాగిపోయేలా సఫలమయ్యారు. కాగా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో.. వనస్థలిపురంలోని వైదేహినగర్లో ప్రారంభమై కర్మన్ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ముగిసిన శోభాయాత్రను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
సుల్తాన్ బజార్, ఏప్రిల్ 16: ‘వీర హనుమాన్ కీ జై’ అన్న భక్తల జయ జయ ధ్వానాలు నగరంలో శనివారం మిన్నంటాయి. హనుమాన్ జయంత్సుత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో భక్త జనం నిర్వహించిన వీర హనుమాన్ శోభాయాత్ర విజయవంతమైంది. వేలాది మంది భక్తులతో గౌలిగూడ రామమందిర్ నుంచి ప్రారంభమై పలు రహదారుల మీదుగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు చేరుకున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి యువకులు కాషాయ జెండాలను చేబూని ర్యాలీగా గౌలిగూడకు చేరుకోగా, బృందావన్ పీఠాధిపతి రితేశ్వర్ జీ మహారాజ్, క్షేత్ర ధర్మ జాగరణ్ ప్రముఖ్ అమర్ లింగన్న, వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజులు ర్యాలీని ప్రారంభించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు శివరాములు, మాజీ అధ్యక్షులు సుభాష్ చందర్, వీహెచ్పీ కోఠి అధ్యక్షులు ఎన్ఆర్ లక్ష్మణ్రావు, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ సింగ్, భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి కన్వీనర్ గోవింద రాఠి, మనోజ్ జైస్వాల్, భజరంగ్దళ్ మీడియా కన్వీనర్ ఎస్.కైలాష్, యమన్ సింగ్లు బైకు ర్యాలీని ప్రారంభించారు.
శోభాయాత్రను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం గౌలిగూడలోని శ్రీ రాంమందిరంలో పూజలు నిర్వహించారు. వీర హనుమాన్ విజయ శోభాయాత్రను పురస్కరించుకుని పలు స్వచ్ఛంద సంస్థలు, యువక సంఘాలు, భక్త మండళ్లు గౌలిగూడ శ్రీరామ మందిరం నుంచి కాచిగూడ చౌరస్తా వరకు స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. పలువురు ప్రసాదాలను పంపిణీ చేశారు. యాత్రలో పాల్గొనడానికి వచ్చిన భక్తులకు మంచినీళ్లు, పులి హోర ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, పెరుగు అన్నం, స్వీట్లు, ఐస్క్రీం, జ్యూస్ వంటివి భక్తులకు అందజేస్తూ పలు సంస్థలు సేవా గుణం చాటారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ చౌహాన్, జాయింట్ సీపీలు రమేశ్ రెడ్డి, రంగనాథ్, కరుణాకర్, సుల్తాన్బజార్ ఏసీపీ దేవేందర్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్రెడ్డి, ఇన్స్పెక్టర్లు రవీందర్రెడ్డి, భిక్షపతి,ఎం సుమన్ కుమార్ శోభాయాత్ర బందోబస్తును సమీక్షించారు.