జలమండలి మేనేజర్పై దాడికి స్థానికులు యత్నం
ముషీరాబాద్, ఏప్రిల్ 12: కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. ముషీరాబాద్ చేపల మార్కెట్, పరిసరాల్లో కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు జలమండలి అధికారులను సమాచారం అందింది. దీంతో జలమండలి అధికారులు, సిబ్బంది మంగళవారం ఉదయం చేపల మార్కెట్ను సందర్శించారు. నీరు కలిషితం అవుతున్న బస్తీలకు వెళ్లిన అధికారులు అక్కడి స్థానికులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొంతమంది స్థానికులు ఆగ్రహంతో జలమండలి అధికారులు, సిబ్బందిపై దాడికి యత్నించారు.
ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు. కలుషిత నీరు సరఫరా అవుతున్నట్లు ఫిర్యాదు వచ్చిన బస్తీలను జలమండలి అధికారులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించారు. స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. పైపు లైన్ను పరిశీలించాలని, అవసరమైన చోట కొత్త పైపులైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ పనులు పూర్తయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. చేపల మార్కెట్లో పైపులైన్ ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వెంటనే పైపులైన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జలమండలి డీజీఎం వాహెబ్, మేనేజర్ కృష్ణమోహన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, నర్సింగ్ప్రసాద్, వి.సుధాకర్ గుప్త, దీన్దయాల్ రెడ్డి, శివ ముదిరాజ్, శ్రీధర్రెడ్డి, భిక్షపతి యాదవ్, గోవింద్, బల్ల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కలుషిత నీటి సరఫరా సమస్య లేదు
చేపల మార్కెట్లో కలుషిత నీటి సరఫరా జరగడం లేదని జలమండలి జీఎం సుబ్బారాయుడు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన వారు అస్వస్తతకు గురికావడానికి తాగునీరు కారణమా.. లేదా.. అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకటి రెండు ఇండ్ల సమస్య అయినప్పటికీ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని, త్వరలోనే కొత్త పైపులైన్ నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు.