ఫైనాన్షియల్ డిస్ట్రిక్కు మహర్దశ
ఖాజగూడ లింకురోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సుందరంగా రాయదుర్గం మల్కం చెరువు అభివృద్ధి
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4: నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్కు మహర్ధశ పట్టింది. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన లింక్రోడ్ల నిర్మాణంతో నాలెడ్జిసిటీ, రాయదుర్గం, ఖాజగూడ, నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ప్రాంతాల రూపురేఖలు మారిపోతున్నాయి. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, లింకురోడ్ల ఏర్పాటుతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నది. తాజాగా మంత్రి కేటీఆర్ మీదుగా రాయదుర్గం, ఖాజగూడ ప్రాంతాల్లో నూతన లింకురోడ్లను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. రాయదుర్గం మల్కంచెరువు నుంచి ఖాజగూడ పాత ముంబాయి రహదారి వరకు ఖాజగూడ లింక్రోడ్డు వయా మల్కంచెరువు, చిత్రపురికాలనీ మీదుగా నూతనంగా నిర్మించిన లింకురోడ్డు, ఖాజగూడ పెద్దచెరువు నుంచి నానక్రాంగూడ ఔటర్ రింగ్రోడ్డు సర్కిల్ వరకు ఉర్ధూ యూనివర్సిటీ ప్రహరీ సమాంతరంగా నిర్మించిన మరో లింకురోడ్డును ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన ఈ అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూబ్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, కార్పొరేటర్లు గంగాధర్రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, హమీద్పటేల్, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, టీఆర్ఎస్ నాయకులు మారబోయిన రాజుయాదవ్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మల్కం చెరువు సుందరీకరణ..
పాత ముంబయి జాతీయ రహదారికి ఆనుకొని 51ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న రాయదుర్గం మల్కం చెరువును సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ చెరువును సుందరంగా తీర్చిదిద్దారు. నాలుగు సంవత్సరాలుగా ఈ చెరువు సందరీకరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. దాదాపు రూ.25కోట్ల భారీ వ్యయంతో చెరువు సందరీకరణతో పాటు పార్కు అభివృద్ధి, చెరువు చుట్టూ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ను దాదాపు 2కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఓపెన్ జిమ్, చెరువు పరిసర ప్రాంతాల్లో అహ్లాదకరంగా తీర్చిదిద్దారు. మంత్రి కేటీఆర్ సోమవారం రాయదుర్గం మల్కం చెరువును ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు.