హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని గ్రంథాలయాలు ఇక నుంచి ప్రతిరోజు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని లైబ్రరీల అభివృద్ధి పై సమీక్ష జరిపారు.
ఈ సమీక్షలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, GHMC కమిషనర్ లోకేష్, నగర చైర్మన్ ప్రసన్న, గ్రంథాలయ సెక్రెటరీ పద్మజ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లు జారీ చేసిన నేపథ్యంలో అనేక మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక శ్రద్ధతో గ్రంథాలయాల అభివృద్ధి కి కృషి చేస్తుందని మంత్రి వివరించారు.
అందులో భాగంగా అన్ని గ్రంథాలయాలలో అన్ని రకాల పేపర్లు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ ను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా పరిధిలో ప్రధానంగా 20 గ్రంథాలయాలలో అన్ని రకాల స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయని, ఆ గ్రంథాలయాలు మాత్రమే ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకు పనిచేస్తాయని వివరించారు.
పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ గ్రంథాలయాల వద్ద అవసరం మేరకు 5 రూపాయల భోజనం అన్నపూర్ణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో TSE WIDC ఈఈ షఫీ, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.