మియాపూర్, జనవరి 7 : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతి పార్టీ కార్యకర్తలోనూ తనను చూసుకున్నానని, శ్రేణులు సైతం తానే అభ్యర్థిగా కృషి చేయడం వల్లే అధిక మెజార్టీతో మూడోసారి గెలుపు తనకు లభించిందని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. అదే స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్రెడ్డిని సైతం బంఫర్ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని నరేన్ గార్డెన్స్లో ఆదివారం నియోజకవర్గ పార్టీ శ్రేణులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎంపీ రంజిత్రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నాగేందర్యాదవ్, దొడ్ల వెంకటేశ్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస్రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజులరెడ్డి, మాధవరం రోజాదేవిలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. విశేష ప్రజాదరణ పొందిన ఎమ్మెల్యే గాంధీ హ్యాట్రిక్ విజయం సాధించారని, పార్టీ శ్రేణుల కృషి ఎంతో ఉన్నదన్నారు.
త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తన గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. పదేండ్లపాటు నిరంతరం ప్రజల్లో ఉండి పని చేసినట్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు చేసిన కృషి హ్యాట్రిక్ విజయానికి దోహదపడిందన్నారు. తన గెలుపుకోసం కృషి చేసిన పార్టీ శ్రేణులకు, ప్రజలకు రుణపడి ఉంటానని, రాబోయే ఐదేండ్లు వారి సేవలో తరిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకోసం పార్టీ శ్రేణులతో కలిసి పోరాడతానన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించుకునేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా నేతలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.