సికింద్రాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పద్మారావు గౌడ్ (BRS Candidate Padmarao) పిలుపునిచ్చారు. సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉన్న సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్రెడ్డి (Minister Kishan Reddy) ని ఓడించి చరిత్రను తిరగరాయాలని కోరారు.
గత శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్కు చెందిన అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన ఊపులోనే సికింద్రాబాద్ పార్లమెంట్ గెలవాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నాయకత్వంలో అన్ని నియోజవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించారని వెల్లడించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎప్పుడూ ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కోసం మరింత కష్టపడతామని అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) మాట్లాడుతూ అనేక హామీలిచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు. కరెంట్, మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపై వస్తున్న తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్ధని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, కిరణ్మయి, డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు.