ఎల్బీనగర్, డిసెంబర్ 4 : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని, పార్టీ మారతాడంటూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారంపై ఎమ్మెల్యే సుధీర్రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి 2019లో ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ వీడి బీఆర్ఎస్లో చేరానని అన్నారు.
ఇదే తనకు మొదటిసారి, చివరిసారి అని మరోసారి పార్టీ మారే అలోచన లేదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కేటీఆర్ సమక్షంలో జరిగిన సమావేశానికి తనకు ఆహ్వానం లేకపోవడంతోనే వెళ్లలేదని, కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన సమావేశంలో తాను పాల్గొన్నానని దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. కొందరు సోషల్ మీడియా వేదికగా, కొన్ని చానల్స్లో తాను సమావేశాలకు గైర్హాజరైనట్లుగా వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఇవి కేవలం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ర్పచారం అని భావిస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎల్బీనగర్ ప్రజల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తానన్నారు.