ఎల్బీనగర్, మే 5: తెలంగాణ రాష్ర్టానికి ఎల్బీనగర్ నియోజకవర్గం ఒక ముఖద్వారం లాంటిదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలు దళిత సంఘాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. కొంత కాలం క్రితం ఎల్బీనగర్ చౌరస్తాలో అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్ పాస్, ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా నిర్మించే పనుల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ విగ్రహాలు తొలగించి కామినేని ఆస్పత్రి దగ్గరలో ప్రధాన రహదారిపై పెట్టామని తెలిపారు. ఫ్లైఓవర్, అండర్ పాస్ పనులు ముగిశాక తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించేందుకు నిర్ణయించామని వివరించారు.
ఎల్బీనగర్ చౌరస్తాలో ఎక్కడ పెట్టాలో మీరే నిర్ణయం తీసుకొని వస్తే అదే స్థలంలో అద్భుతమైన రింగ్ను ఏర్పాటు చేసి తిరిగి మహనీయుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తామని తెలిపారు. దీంతోపాటు శ్రీకాంతాచారి, జయశంకర్ సార్ విగ్రహాలు కూడా ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్టడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడానికి వీల్లేదన్నారు. ఎవరైనా కమీషన్లు అడిగితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు చిరంజీవి, అడాల రమేశ్, గుంటి లక్ష్మణ్, రమేశ్, పలువురు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధి కోసం ధర్మకర్తలు అందరూ కృషిచేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్సుఖ్నగర్ శ్రీకనకదుర్గ అమ్మవారి నూతన ఆలయ ధర్మకర్తలను దేవాదాయ శాఖ నియమించింది. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాంచందర్, ఈఓ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్రెడ్డి, శివప్రకాశ్, నూతన కమిటీ డైరెక్టర్లు జయశ్రీ, శిల్ప, అనిల్, వెంకటేశ్, అప్పారావు, శ్రీనివాస్రెడ్డి, తులసీ కృష్ణగౌడ్, సంతోష్ యాదవ్, మహేశ్ యాదవ్, కిషన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.