TSRTC | హైదరాబాద్ : ఎల్బీనగర్లో గత రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో విధుల్లో ఉన్న కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన సంగతి తెలిసిందే. కండక్టర్ను కాలితో తన్ని, అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడ్డ మహిళా ప్రయాణికురాలిపై ఆర్టీసీ అధికారులు ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళపై 353, 504 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
హయత్నగర్ డిపో-1కు చెందిన కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటనపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఈ ఘటనను ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారు. వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సంస్థ విజ్ఞప్తి చేస్తోంది.
ఇది మొదటి ట్రిప్పు అని తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించిన ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆమె అసభ్య పదజాలంతో దూషించారు. ఒకట్రెండు తన కాలితో కండక్టర్ను తన్నింది. తాను మర్డర్లు చేస్తా.. చంపేస్తానంటూ కండక్టర్ను బెదిరింపులకు గురి చేసింది. ఆమెను నిలువరించేందుకు మరో మహిళా కండక్టర్ ప్రయత్నించినప్పటికీ, ఆమె పట్ల కూడా దురుసుగా ప్రవర్తించింది.