ఎల్బీనగర్, డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వేంకటేశ్వరస్వామి దేవాలయాలు, సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఉదయం నుండే దేవాలయాల్లో ఉత్తర ద్వారాల ద్వారా స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. దిల్సుఖ్నగర్ లలితానగర్లోని గడ్డిఅన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయంతో పాటు కోదండరాంనగర్లోని వేంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, దేవిరెడ్డి కమలారెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ వూర నర్సింహ గుప్తా, మార్గం రమేశ్, వక్కలంక శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, లక్ష్మీ నర్సింహారావు, రామేశ్వర్, సూర్యనారాయణ రెడ్డి, రమణారెడ్డి, వరదాచార్యులు తదితరులు పాల్గొన్నారు. స్నేహపురి కాలనీలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక కార్యకరమాలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు పోటెత్తడంతో ఇన్నర్ రింగ్రోడ్డుపై అరకిలోమీటర్ క్యూ లైన్ ఏర్పడింది. ఆలయ కమిటీ చైర్మన్ వంశీ, కాలనీ అధ్యక్షుడు సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బడంగ్పేట, డిసెంబర్ 23: వేంకటేశ్వర స్వామి కృపతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల ఇంద్రారెడ్డి తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీనగర్ ప్యాబ్ సిటీలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పి.కార్తీక్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, సుదర్శన్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు.
మహేశ్వరం, డిసెంబర్ 23: మహేశ్వరంలోని వీరాంజనేయ స్వామి ఆలయం, గట్టుపల్లిలోని వీరాంజనేయస్వామి దేవాలయం, అమీర్పేట్పేట్లోని గోదాసమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రజలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మోదిని శంకరప్ప, శివకుమార్, శివమూర్తి, శివప్రసాద్ కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్ కరోళ్ల ప్రియాంక రాజేశ్, అనితా ప్రభాకర్రెడ్డి, బస్వశ్రీశైలం గౌడ్, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్, గోదాసమేత వేంకటేశ్వర స్వామి దేవాస్థాన చైర్మన్ ఆవుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, డిసెంబర్ 23: మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆదిత్యనగర్కాలనీలోని లక్ష్మీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం, విజయశ్రీకాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయం, నాగోల్లోని రామాలయానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణ, బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్రెడ్డి తదితరులు ఆదిత్యనగర్కాలనీలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్యనగర్కాలనీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్టు చైర్మన్ టి.మోహన్రెడ్డి, చైర్పర్సన్ సంతోషికుమారి, సభ్యులు రవీందర్, విజయశ్రీకాలనీలోని వేంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ చీర్క నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆర్కేపురం, డిసెంబర్ 23 : వాసవి కాలనీలోని అష్టలక్ష్మి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు.
చంపాపేట, డిసెంబర్ 23: కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ అనుబంధంలోని కోదండ రామాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్య్రకమంలో ఆలయ ధర్మకర్తలు భక్తులు బచ్చు మహేశ్ గుప్తా దంపతులు, బిక్కుమాండ్ల శ్రీనివాస్ గుప్తా దంపతులు తదితరులు పాల్గొన్నారు.