RTA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఆర్టీఏలో బదిలీల టెన్షన్ కొనసాగుతుంది. ఈ ప్రక్రియలో రవాణా శాఖ కమిషనర్ కార్యాలయం గతానికి విరుద్ధంగా గోప్యత పాటిస్తుండటంపై పలు సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మధ్యరాత్రి అధికారులకు వ్యక్తిగతంగా వాట్సప్, మెయిల్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తున్నారు. తెల్లారే సరికి మరో కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఈ ప్రక్రియపై అధికారులు కొంత అసహనానికి గురవుతున్నారు. గతంలో బదిలీ అయ్యే వారి పేర్లన్నీ కలిపి ఒకే ఉత్తర్వు జారీ అయ్యేది. కానీ ఈ సారి ఎంతమంది బదిలీ కావాలో వారందరికి విడివిడిగా వ్యక్తిగతంగా ఆదేశాలు పంపిస్తున్నారు.
ఒకే కార్యాలయంలో పనిచేసే వారైనప్పటికీ ఎవ్వరికి రాత్రి బదిలీ ఆదేశాలు వచ్చాయో తెలువడం లేదని అధికారులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా బదిలీలు జరిగే ప్రక్రియకు ప్రభుత్వం గోప్యత పాటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ పరిధిలో 9 మంది ఆర్టీఓలు, 37 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఎంవీఐ) బదిలీ అయ్యారు. కొందరికి ఇతర జిల్లాలో..మరికొందరికి గ్రేటర్లోనే బదిలీలు జరిగాయి. గ్రేటర్లో మొత్తం పది ఆర్టీఓ కార్యాలయాలుండగా, రెండు (కూకట్పల్లి, కొండాపూర్) యూనిట్ ఆఫీసులు ఉన్నాయి. కాగా, గ్రేటర్లో ఇద్దరు ఆర్టీఓలు రాంచందర్, సురేశ్ రెడ్డి మినహా మిగిలిన అందరికి గ్రేటర్లోనే పోస్టింగ్లు దక్కాయి.