Lasya Nanditha | హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఆమె తలకు తీవ్ర గాయమైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఎడమ కాలు ఎముక, దవడ ఎముకతో పాటు ఛాతీ ఎముకలు పూర్తిగా విరిగిపోయాయి. ఆరు దంతాలు కూడా ఊడిపోయాయని వైద్యులు తెలిపారు. సీటు బెల్ట్ ధరించి ఉంటే గాయాలు తక్కువగా అయ్యేవి అని వైద్యులు పేర్కొన్నారు.
శవపరీక్ష పూర్తి చేసిన వైద్యులు.. ఆమె భౌతికఖాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. లాస్య నందిత పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.