అమ్మా బైలెల్లినాదో.. తల్లీ బైలెల్లినాదో.. అంటూ పోతురాజుల ఆటపాటలు, శివసత్తుల నృత్యాల నడుమ కన్నులపండువగా లష్కర్ బోనమెత్తింది. జగమేలే తల్లి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజామునే మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబసమేతంగా తొలిబోనం సమర్పించి ఉత్సవాలు ప్రారంభించారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. పోతురాజుల ఆటలు, కోలాటం బృందాలు, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో వందలాది మంది మహిళలు అమ్మవారికి బోనాలతో మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే తొట్టెలు, ఫలహారబండ్లు ఊరేగింపు ప్రారంభమైంది. సోమవారం ఉదయం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. మరోవైపు చారిత్రక గోడ కోట జగదాంబిక ఎల్లమ్మకు ఆషాఢ మాసం బోనాలలో భాగంగా ఆరో బోనం పూజలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
– సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) /బేగంపేట్ /మెహిదీపట్నం
సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలు వైభవంగా జరిగాయి. ఆదివారం వేకువజాము నుంచి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తల్లీ బైలెల్లినాదో.. అమ్మా బైలెల్లినాదో.. అంటూ పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తజనంతో కిక్కిరిసాయి. భక్తులు బోనాలతో అమ్మవారి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సమేతంగా బోనం సమర్పించి తొలిపూజ నిర్వహించారు.
అంతకుముందు ఆలయ ఈవో మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రి దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. తలసాని వెంట ఆయన తనయుడు సాయికిరణ్యాదవ్ ఉన్నారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. అమ్మవారికి మహాహారతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించిన అనంతరం సాకలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో 175 సీసీ కెమెరాలతో నిఘా, 2వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.
బంగారు బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..
మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్యనగర్ కమాన్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల సందర్భంగా నిర్వహించిన పూజల్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత బంగారు బోనంతో అమ్మవారి ఆలయానికి వచ్చారు. వందలాది మంది మహిళలు బోనాలతో వెంటరాగా, పోతురాజుల ఆటలు, కోలాటం బృందాలు, గుస్సాడీ నృత్యం, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్లతో తరలివచ్చారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్, శోభ దంపతులు బోనాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న సీఎం దంపతులకు పూర్ణకుంభంతో పూజారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో పట్టు వస్ర్తాలను సీఎం కేసీఆర్ స్వయంగా తీసుకెళ్లి మహంకాళి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వానం మేరకు వారి నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు.ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ నివాసంలోని ముత్యాలమ్మ గుడిలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్న భోజన ఆతిథ్యాన్ని సీఎం దంపతులు స్వీకరించారు.
అమ్మవారికి బోనం సమర్పించిన ప్రముఖులు..
మహంకాళి జాతరను పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మొదటి బోనం సమర్పించిన అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కుటుంబ సమేతంగా హాజరై బోనం సమర్పించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అమ్మవారికి బోనం సమర్పించారు.