సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : పాత నగరంలోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. మంగళవారం మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ విస్తరణ కోసం సేకరించాల్సిన స్థలాల యజమానులు, ఎమ్మెల్యే బలాలతో కలిసి మంత్రి సమావేశం నిర్వహించి మాట్లాడారు.
సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో ప్రకటించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొన్ని నిర్మాణాల స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. సంబంధిత స్థలాల యజమానులకు ప్రభుత్వం తగిన న్యాయం జరిగే విధంగా పరిహారం అందిస్తుందని, ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం 9 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్, సభ్యులు రాజ్ కుమార్, బద్రినాద్, జగదీశ్, రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.