పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల్ను షాదీ.కామ్లో అప్లోడ్ చేసింది. ఆ ప్రొఫైల్ చూసిన పొట్లూరి బాలవంశీకృష్ణ..తాను కూడా సాప్ట్వేర్ ఇంజినీర్నంటూ.. పరిచయమయ్యాడు. మాయమాటలతో డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలు బుధవారం సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇటీవల రాచకొండ పోలీసులు ఓ యువతిని మోసం చేసిన కేసులో వంశీకృష్ణను అరెస్ట్ చేశారు.
మ్యాట్రిమోని సైట్లో పరిచయమై..పెండ్లి పేరుతో మాటలు కలిపి, విలువైన బహుతులు పంపిస్తున్నామని, తమను ఎయిర్పోర్టులో పట్టుకున్నారంటూ..నటించి.. దోపిడీకి పాల్పడుతున్న నైజీరియన్ సైబర్ ముఠాను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కథనం ప్రకారం.. కనోన్ ఇవ్రార్డ్, ఎంఎస్ క్యాంటె మారే, సెర్జి ఓలివేర్ ఐవోరి కోస్ట్, ఓలాబి అబిడన్ ఒమ్రిలివ, ఓసాస్ ఫ్రీడోలు నైజీరియాకు చెందిన వాళ్లు. వీరంతా వ్యాపారం, టూరిస్ట్ వీసాలపై భారత్కు వచ్చి ఢిల్లీలో ఉంటున్నారు. తమ ఆఫ్రికన్ స్నేహితులతో సైబర్నేరాలు ఎలా చేయాలి.. అమాయకులను ఎలా మోసం చేయాలనే అంశాలపై పట్టు సాధించారు.
యూరోపియన్ దేశస్తులుగా చెప్పుకుంటూ.. ఇంటర్నెట్ నుంచి అందమైన అబ్బాయిల ఫొటోలు తీసి.. మ్యాట్రిమోని సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పెండ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వివిధ కారణాలు చెప్పి.. బాధితుల వద్ద నుంచి దఫ దఫాలుగా రూ. 23.3 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు.. నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన పోలీస్ బృందం సెర్జి ఓలివేర్, ఓలాబి అబిడన్ ఒమ్రిలివ, ఓసాస్ ఫ్రీడోలను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. ప్రధాన సూత్రధారులైన కనోన్ ఇవ్రార్డ్, ఎంఎస్ క్వాంటెమారేలు పరారీలో ఉన్నారు.