కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం
క్యాంపు ఆఫీసు వద్ద నల్లజెండాలతో నిరసన
కేపీహెచ్బీకాలనీ, ఏప్రిల్ 7 : అసమర్థ బీజేపీ సర్కా రు వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అడ్డూఅదుపు లేకుండా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్యే కృష్ణారావు గురువారం తన ఇంటికి నల్లజెండాలు కట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోజురోజుకూ పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతోందని, ధరలు అమాంతం పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలప్పుడు పెట్రో ధరలు పెంచని కేంద్రం..ఇప్పుడు ఎందుకు ఇష్టానుసారం పెంచుతున్నదని, బీజేపీని ఓడిస్తేనే ధరలు తగ్గుతాయని చెప్పారు. కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, పార్టీ నాయకులు పాల్గొన్నారు.