కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 5 : తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం, వ్యాపారం, బతుకుదెరువు కోసం వచ్చి కూకట్పల్లిలో నివసిస్తున్న వారంతా తెలంగాణ బిడ్డలే.. పండుగకు గంగిరెద్దు వాళ్లు వచ్చినట్లు.. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికలు రాగానే ఇక్కడ వాలిపోయి.. మాయమాటలతో ప్రజలను మభ్యపెడతారు.. వారి మాటలు నమ్మొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డు ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కాపు నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే కృష్ణారావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కులాలు, మతాలకతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించడంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి బతకడానికి వచ్చిన వారంతా తెలంగాణ బిడ్డలేనని, సెటిలర్లు అనే పదం వాడొద్దన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్యన చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని.. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్పై రేవంత్ రెడ్డి, కిషన్రెడ్డి ఆరోపణలు చేస్తారని.. ఏనాడైనా రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారా.. అని ప్రశించారు. తనను అన్నగా.. తమ్ముడిగా భావించి రెండు పర్యాయాలు అఖండ మెజార్టీని అందించిన కూకట్పల్లి ప్రజలు.. మరోసారి గెలిపిస్తే రుణం తీర్చుకుంటానన్నారు.
ఈ సందర్భంగా కాపు నేతలు ఎమ్మెల్యే కృష్ణారావుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పగుడాల బాబూరావు, తూము శ్రవణ్కుమార్, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, బసల శ్రీనివాస్, హెచ్ఎన్ మూర్తి, భగవాన్, మోటెపల్లి రంగమోహన్, రమణప్రసాద్, వలవలనాయుడు, వాసునాయుడు, ప్రభాకర్, బుట్టో రాంబాబు, పున్నారావు, భవానీ, ధనలక్ష్మి, రాజేశ్ రాయ్, శంకర్, దినేశ్, బాలకృష్ణ, నాగేశ్వర్రావు, నాగమల్లేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.