అల్లాపూర్,సెప్టెంబర్4: కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధిలో అల్లాపూర్ డివిజన్ను నంబర్వన్ గా తీర్చిదిద్దామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సోమవారం అల్లాపూర్ డివిజన్లో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రలో పెద్దఎత్తున ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే వెంట నడిచారు. వివేకానందనగర్, తులసీనగర్ ప్రాంతాల్లో కార్పొరేటర్ సబీహాబేగంతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిని పలకిరిస్తూ..ప్రజా సంక్షేమ పథకాలను వివరస్తూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కాలనీల్లో పర్యటిస్తూ..ఇంటింటికి వెళ్లి సమస్యలను తెలసుకుంటున్నామని చెప్పారు.
సమస్యలను తెలసుకొని, సత్వర పరిష్కార చర్యలు చేపడుతున్నామని, మరికొన్నింటికి ప్రణాళిక సిద్ధం చేసి, ప్రతిపాదనలు పంపిస్తున్నామని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా చూస్తామన్నారు. డ్రైనేజీ, రోడ్లు వీధిలైట్లు, తాగునీరు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. వివేకానందానగర్, తులసీనగర్లో 90శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, పెండింగ్ పనులు కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. పాదయాత్రలో గుర్తించిన ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్షుడు గౌసుద్దీన్, లింగా ఐలయ్య, వీరారెడ్డి, పిల్లి తిరుపతి, జహెద్ షరీఫ్, రోణంకి జగన్నాథం, సామకొండల్రెడ్డి, సంపత్రెడ్డి, జ్ఞానేశ్వర్, కళ్యాన్నాయక్, విష్ణు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.