కేపీహెచ్బీ కాలనీ, మార్చి 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్ల కాలనంలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిందని.. పేదలకు సంక్షేమ ఫలాలందిస్తూ ఆదర్శవంతమైన చేస్తుందని.. చేసిన పనులనే ప్రజలకు చూపించి వివరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ బీఆర్ఎస్ పార్టీ బూత్స్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో దేశంలో ఎక్కడాలేని విధంగా వృద్ధులకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.3వేల పింఛన్, పేదింట్లో ఆడబిడ్డ పెండ్లికి లక్షా నూటపదహారు రూపాయల ఆర్థిక సహాయం, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు.
ప్రపంచ దేశాలు హైదరాబాద్ నగరంలో పెట్టుబడులు పెట్టేలా అనువైణ వాతావరణం కల్పించారని.. తద్వారా రాష్ర్టాభివృద్ధితో పాటు లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత విద్వేశాలు రెచ్చగొడుతుందని, రాష్ట్ర అభ్యున్నతికి అడ్డుపడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం లేదని, అసమర్ద పాలనా విధానాలతో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుందని పేదలను ఇబ్బందులు పెడుతూ ఆదాని లాంటి పెద్దలకు దోచుకునేలా చేస్తుందని దూయబట్టారు. అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను ఆగంచేసే కుట్రలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
కేపీహెచ్బీ కాలనీలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం రాజీవ్గాంధీ సర్కిల్లో ఫ్లై ఓవర్, కాలనీ 7వ ఫేజ్లో రైల్వే అండర్పాస్ బ్రిడ్జిని నిర్మించడం జరిగిందని, అంతర్గత రోడ్లన్నింటినీ సీసీరోడ్లుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కాలనీలో మోడల్ రైతుబజార్, ఫిష్ మార్కెట్, మోడల్ మార్కెట్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లను అందుబాటులోకి తెచ్చానని.. 12ఏండ్లుగా ఆగిపోయిన ఇండోర్ స్టేడియం పనులను పూర్తిచేయించి స్విమ్మింగ్ఫూల్, ఇండోర్ కోర్టులను అభివృద్ధి చేసి.. పలుచోట్ల ఇండోర్ షెటిల్ కోర్టులు, క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. నగరంలో ఎక్కడాలేని విధంగా మహిళలకు, చిన్నారులకు ప్రత్యేక పార్కు, దాతల సహకారంతో ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల నిర్మాణం, కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో కేబీఆర్ పార్కు తరహాలో పార్కు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే కాలనీ 9వ ఫేజ్లో రెండున్నర ఎకరాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించామన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకని ప్రజలకు చేసిన పనులను వివరించి వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపుకోసం సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే కృష్ణారావు కోరారు. కాలనీలు, బస్తీలలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు మల్కన్నగారి కృష్ణారెడ్డి, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, జనగాం సురేశ్రెడ్డి, మందలపు సాయిబాబా చౌదరి, శ్యామలరాజు, జన్ను సాయిశ్రీనివాస్, రాజేశ్ రాయ్, భవానీ, భారతి, రమాదేవి, కన్నాలత, ఎస్.కె.మహబూబ్, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలున్నారు.
అల్లాపూర్,మార్చి5: ప్రజల మధ్యన విద్వేశాలు రెచ్చగొడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న బీజేపీని కూకటివేళ్లతో పెకిలించివేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రినగర్ చంద్రాగార్డెన్స్లో కార్పొరేటర్ సబీహాబేగం ఏర్పాటు చేసిన బూత్స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తున్న కార్పొరేటర్ సబీహాబేగం పనితీరు అద్భుతం అని ఆయన కితాబాబిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మేడ్చెల్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్ గౌసుద్దీన్, డివిజన్ అధ్యక్షుడు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లితిరుపతి, నాయకులు జాహెద్ షరీఫ్ బాబా, రోణంకి జగన్నాథం, పార్వతమ్మ, దుర్గ, జ్ఞానేశ్వర్, యోగిరాజు తదిరతులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 5 : ఎనిమిదేండ్ల కాలంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావుల సమక్షంలో బీజేపీ సీనియర్ సీనియర్ నాయకుడు కోదండరామయ్య, మహిళా బీజేపీ నేతలు వెంకటేశ్వరమ్మ, రజిత, మాధవి, ధనలక్ష్మి, నాగమణిలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అడుసుమల్లి వెంకటేశ్వర్రావు, సాయిబాబా చౌదరి, శ్యామలరాజు, రాజేశ్ రాయ్, సాయిశ్రీనివాస్, భవానీ, రమాదేవి, కన్నాలత తదితరులున్నారు.