హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) నేడు(గురువారం) నేడు తెలంగాణ భవన్కు(Telangana Bhavan) రానున్నారు. బీఆర్ఎస్ డైరీ, నూతన క్యాలెండర్లు ఆవిష్కరిస్తారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను కలువనున్నారు. కాగా, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో వ్యవసాయం, సాగునీటి రంగాలు గాడినపడాలని తెలంగాణ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తెలంగాణ రైతులు, మహిళలు, సకలజనులు సుఖసంతోషాలతో జీవించాలని అభిలషించారు. కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలు సిద్ధించాలని కోరుకున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బుధవారం ఒక ప్రకటనలో ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ గతేడాది ప్రజాసమస్యల పరిష్కారానికి చేసిన అవిరళ కృషిని గుర్తుచేసుకున్నారు. పార్టీ శ్రేణులు, నేతలు పోరాడి సాధించిన విజయాలను స్మరించుకున్నారు. ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్ఎస్ రెట్టించిన పట్టుదలతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. నూతన వత్సరంలో యువత, వృత్తి నిపుణులు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకొని తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని ఆకాంక్షించారు.