బడంగ్పేట, మే 7: చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలకు ప్రజలు అంచనాకు మించి తరలివచ్చారని, దీంతో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైందని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన కేటీఆర్ రోడ్ షోలను గ్రాండ్ సక్సెస్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులకు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బడంగ్పేట గాంధీనగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలకు జనం రావడంతో ఆ ప్రాంతం జన సంద్రంగా మారిందన్నారు. కళాకారుల పాటలకు.. సభకు వచ్చిన ప్రజలు నృత్యం చేశారన్నారు. మహిళలు పెద్ద సంఖ్య లో సభకు తరలిరావడం చూస్తుంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకతో సభలో పుల్ జోష్ వచ్చిందని, పార్టీ శ్రేణులు, ప్రజలు గులాబీ జెండాలు ఎత్తి కేటీఆర్కు ఘన స్వాగతం పలికారని వివరించారు. కేటీఆర్ మాట్లాడుతున్నంత సేపు జనం ఆసక్తిగా ఆయన మాటలు విన్నారని చెప్పారు. కాసానిని గెలిపించుకొని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గిఫ్టుగా ఇద్దామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో ప్రజలు నిలదీయాలన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూ టీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు అర్జున్, శోభా ఆనందర్ రెడ్డి, స్వప్న వెంకట్ రెడ్డి, పవన్ కుమార్ యాదవ్, దీపికాశేఖర్ రెడ్డి, స్వప్న జంగారెడ్డి, మమత కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, కామేశ్ రెడ్డి, అరవింద్ శర్మ, శ్రీనివాస్ రాజ్, రాజు నాయక్, విజేందర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.