బడంగ్పేట, మే 5 : చేవెళ్ల పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మాజీ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం ( ఈ నెల 6న) చేవెళ్లలో నిర్వహించనున్న కేటీఆర్ రోడ్ షో కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆమె బీఆర్ఎస్ శేణులు, ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు, అభిమానులకు పిలుపు నిచ్చారు. ఈ నెల 6న శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్లో, ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సాయత్రం 5గంటలకు, రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లి నగర్ చౌరస్తా వద్ద సాయంత్రం 6గంటలకు , మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో సాయంత్రం 7గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యరి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రతో ప్రజల్లో పెను మార్పు వచ్చిందన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఇచ్చిన హమీలను తుంగలో తొక్కి తిరిగి మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్న వారిని ప్రజలు చీకొడుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ బస్సు యాత్ర చేపడితే అక్కడ ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తున్నారన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కేటీఆర్ రోడ్షో, కార్నర్ మీటింగ్లకు ప్రజల స్పందన చూసిన కాంగ్రెస్, కాషాయం పారీలకు కండ్లు మండుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీలంతా ఏకమై కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పారు. కేటీఆర్ రోడ్ షో కార్యక్రమానికి 20వేల పైచిలుకు ప్రజలు స్పచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రోడ్ షో, కార్నర్ మీటింగ్ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.