KTR : కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కొడుకుపైన నమోదైన ఫోక్సో కేసుపై భారత రాష్ట్ర సమితి కేటీఆర్ (KTR) తీవ్రస్వరంతో స్పందించారు. బాధితురాలపై ఉల్టా కేసు పెట్టడంపై మండిపడిన ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)తో పాటు రాష్ట్ర ప్రభుత్వం పైనా పలు ప్రశ్నలు సంధించారు. ఆ బాధిత బాలిక పరిస్థితి, ఆమె కుటుంబంపై జరుగుతున్న వేధింపులపై తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
నరేంద్ర మోదీని ఉద్దేశించి.. మీ ‘బేటీ బచావో’ కేవలం ఒక నినాదమేనా? కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మంత్రి తనయుడు కాబట్టి అతడికి మినహాయింపు ఉంటుందా? బండి సంజయ్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? ఆయనను మంత్రివర్గం నుండి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారు? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు అధికారంలోని కాంగ్రెస్ను కూడా కేటీఆర్ వదల్లేదు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘తెలంగాణలో మీ పార్టీ ఎలాంటి ‘జంగిల్ రాజ్’ నడుపుతోంది? ఒక మైనర్ బాలిక అన్ని ఆధారాలతో వచ్చినప్పుడు పోలీస్ శాఖ అత్యంత వేగంగా ఎందుకు స్పందించలేదు? కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై ఇతర POCSO నేరస్తుల మాదిరిగానే కేసు నమోదు చేసి ఎందుకు విచారణ జరపడం లేదు? మైనర్ బాలికపైనే ఎదురు కేసు ఎందుకు పెట్టారు? ఉన్నావ్ కేసులో మాదిరిగా.. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలికి, ఆమె కుటుంబానికి అండగా నిలబడతారా? ఉన్నావ్ తరహా ఉద్యమం తెలంగాణ బాధితులకు వర్తించదా? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ ఒక ఫ్రాంచైజీలా పనిచేస్తోందా? ఒక మైనర్ బాలిక గౌరవం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక అపవిత్రమైన, అసహ్యకరమైన ఒప్పందానికి వచ్చాయా?’ అని కేటీఆర్ రెండు జాతీయ పార్టీలను కడిగిపారేశారు.

‘ఓ 17 ఏళ్ల అత్యాచార బాధితురాలు, ఆమె కుటుంబం ఒక FIR నమోదు చేయించుకోవడానికే మూడు నెలలకు పైగా ఎందుకు పోరాడాల్సి వస్తోంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. మనం ఎంతటి దుర్భరమైన, భయంకరమైన నరకంలో జీవిస్తున్నామో ఆ కుటుంబం కష్టం చూస్తే అర్థమవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని నేరస్థుల్లా చూస్తూ ఎందుకు వేధిస్తున్నారు? ఆ మైనర్ బాలిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. న్యాయం కోసం వారు మూడు నెలలుగా తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు ఆమెనే నిందిస్తున్నారు? (Victim Shaming)? ఏ నిబంధన ప్రకారం తెలంగాణ పోలీసులు ఒక మైనర్ బాలికపై హనీ-ట్రాప్, వసూళ్ల కేసు నమోదు చేశారు? మన మహిళల గౌరవం కోసం గతంలో అణచివేతదారులతో, ప్రభుత్వాలతో పోరాడాం. ఆడబిడ్డల రక్షణ కోసం అవసరమైతే మరో మిలియన్ సార్లు మళ్ళీ పోరాడుతాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.