సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే సమస్యను పరిష్కరించే విషయంలో జీహెచ్ఎంసీ ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు. నాగోల్ బండ్లగూడలోని అరుంధతీ ఎన్క్లేవ్లో బల్దియా నిర్లక్ష్యం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను స్థానికులు ఎక్స్ ద్వారా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తమ కాలనీల్లో చెట్లు భారీగా పెరగడం, చెత్తాచెదారం కారణంగా పాముల బెడద ఉందని జీహెచ్ఎంసీ మేయర్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఓ వ్యక్తి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ కాలనీలో 50 కుటుంబాలున్నాయని, సరైన రోడ్లు, నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాత్రి అయితే.. దొంగతనాలు జరుగుతున్నాయని కేటీఆర్కు వివరించాడు. ఈ ట్వీట్పై కేటీఆర్ స్పందించారు. ఆ నెటిజన్ ఫిర్యాదుపై స్పందించి సమస్యను పరిష్కరించాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కోరారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఏ సమస్య ఉన్నా సరే ఒక్క ట్వీట్ చేస్తే ఆ సమస్యను పరిష్కరించే వాళ్లమని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కార్పొరేటర్ల పార్టీ ఫిరాయింపులపై మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టడంతో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇకపై ప్రజా సమస్యలపై మేయర్ సహా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. 48 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోతే స్థానికులతో కలిసి తామే శ్రమదానం చేసుకొని సమస్యను పరిష్కరించుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు.