KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా..? జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడికి రమ్మన్నా వస్తామని చర్చకు సిద్ధమా ? అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రగతి నివేదికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఓటమి భయంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు రేవంత్ సిద్ధమా? అంటూ ఆయన సవాల్ విసిరారు.
కేసీఆర్ హయాంలో ఫ్లై ఓవర్లు, అండర్పాసులు నిర్మించామన్నారు. రేవంత్ ప్రభుత్వం కొత్తగా ఎన్ని ఫ్లై ఓవర్లు కట్టిందని.. రేవంత్ ప్రభుత్వం కనీసం రోడ్లపై పడిన గుంతలనైనా పూడ్చిందా? అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చేదెవరో ప్రజలందరికీ తెలుసునని, కాంగ్రెస్ హయాంలో మంచినీటి కష్టాలు మొదలయ్యాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో 3వేల నుంచి 7.5 వేల మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరిగిందని.. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో హైదరాబాద్ను క్లీన్ సిటీగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ను మురికికూపంగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పవర్ హాలీడేలు విధించేవారని, కేసీఆర్ పాలనలో24గంటలు నాణ్యమైన కరెంట్ అందించామన్నారు.
కేసీఆర్ హయాంలో విద్యుత్ వెలుగులు నిండాయని, గ్రీన్ సిటీ ఆఫ్ ది వరల్డ్గా హైదరాబాద్ను తీర్చిదిద్దామన్నారు. 16వేల నర్సరీలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. హెచ్సీయూలో జీవవైవిధ్యాన్ని నాశనం చేసిన ఘనత రేవంత్రెడ్డిదన్నారు. రేవంత్ బెదిరింపులకు ఎన్నో పరిశ్రమలు తరలిపోతున్నాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని విమర్శించారు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ డ్రగ్స్ దందాను పట్టుకున్నారని, రూ.12వేల డ్రగ్స్ దొరికితే పట్టింపులేదా?.. తెలంగాణ ముఖ్యమంత్రి, పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి రిపోర్ట్ను ఇంటింటికీ పంపిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.5,328 కోట్లు ఖర్చు చేశామని.. మెట్రోపై రూ.1,722 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
ఎస్ఆర్డీపీ కింద రూ.333కోట్లతో షేక్పేట ఫ్లై ఓవర్ను నిర్మించామని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశామన్నారు. ఎర్రగడ్డలో రూ.900 కోట్లతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించామన్నారు. వెయ్యి పడకలతో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు. కోవిడ్లో రూ.14కోట్లతో వ్యాక్సిన్లు వేశామని, బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు వైద్యాన్ని చేరువ చేశామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూంలు కట్టామని, రెహ్మత్నగర్లో కట్టిన 3600 డబుల్ బెడ్రూంలను పంపిణీ చేశామన్నారు. ప్రైవేట్ వాళ్లు కడితే ఒక్కో డబుల్ బెడ్రూంకు రూ.కోటి ఛార్జ్ చేసేవారన్నారు. ఆసరా పెన్షన్, కల్యాణలక్ష్మి కింద దాదాపు రూ.600 కోట్లు అందించామన్నారు. 106 మందికి దళితబంధు అందించామన్నారు.
పండుగల కోసం 14కోట్లు అందించామని, అన్నపూర్ణ భోజనాల కోసం రూ.2కోట్లు చెల్లించినట్లు వివరించారు. మైనారిటీల కోసం 204 గురుకులాలను ఏర్పాటు చేశామని, రూ.51కోట్లతో గురుకులాలన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.87కోట్లు ఖర్చు చేశామని, రూ.17కోట్లతో ఫంక్షన్ హాలు నిర్మించినట్లు తెలిపారు. రూ.455 కోట్లతో పది సబ్స్టేషన్లను కట్టామని, జూబ్లీహిల్స్లో విద్యుత్ నిర్వహణ కోసం రూ.505కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు రూ.30కోట్లు ఖర్చు చేశామన్న కేటీఆర్.. రూ.180కోట్లు మంచినీటి కోసం ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. పార్కుల నిర్వహణకు రూ.20కోట్లు, డీఆర్ఎఫ్ పెట్టి ప్రజలకు సహాయక చర్యలు అందించామన్నారు.
బీఆర్ఎస్ హయాంలో రూ.5328 కోట్లు ఖర్చు చేస్తే.. రెండేళ్ల రేవంత్ పాలనలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రెండేళ్లలో చేసిన అభివృద్ధిని చూపించి రేవంత్ ఓట్లు అడగాలని, గోపీనాథ్ వేసిన శిలాఫలకం జూబ్లీహిల్స్లో ఎక్కడికి పోయినా కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రతీ ఇంటికీ ప్రగతి ప్రస్థాన నివేదికను పంపిస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో స్వచ్ఛ్ సర్వేక్షణ్లో 34 అవార్డులు వచ్చాయని.. రేవంత్ పాలనలో ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. ప్రజలే న్యాయనిర్ణేతలని.. జూబ్లీహిల్స్లో సరైన జవాబిస్తారన్నారు. రేషన్కార్డుల పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువ ప్రచారం చేయలేదని, కాంగ్రెస్ అభివృద్ధి చేయలేక రేషన్కార్డులు ఇచ్చామని ప్రచారం చేశారన్నారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధిపై, కాంగ్రెస్ అభివృద్ధికి చర్చకు సిద్ధమా? టైమ్, ప్లేస్ చెబితే ఎక్కడికైనా వస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ సెంటర్, అసెంబ్లీ, గాంధీభవన్ ఎక్కడికి రమ్మన్నా వస్తామని.. చర్చకు సిద్ధమా ? అంటూ సవాల్ విసిరారు కేటీఆర్.