సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అమీర్పేట హెచ్ఎండీఏ కేంద్ర కార్యాలయంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పురపాలక శాఖ ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పురపాలక విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న రోడ్డు నిర్వహణ, నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ కార్యక్రమాల్లో భాగంగా కొనసాగుతున్న పనుల వివరాలను అధికారులు మంత్రికి అందించారు.
సీఆర్ఎంపీ కార్యక్రమం ద్వారా నిరంతరం నగరంలోని ప్రధాన రహదారుల నిర్వహణ కొనసాగిస్తున్నందున, వాటి ఫలితాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్వహణతో పాటు రోడ్డుకు అనుబంధంగా ఉన్న పుట్పాత్, జంక్షన్ల అభివృద్ధి, నిర్వహణ వంటి అంశాల పైన మరింత దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే దేశంలో వివిధ నగరాల్లో మోడల్ రోడ్డు నిర్వహణ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని జనాగ్రహ వంటి సంస్థల ఆధ్వర్యంలో జంక్షన్ల సుందరీకరణ, అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టామని, ఆయా కార్యక్రమాలు త్వరలోనే పూర్తవుతాయని అధికారులు మంత్రి కేటీఆర్కి తెలియజేశారు. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయని, ఈసారి భారీగా వర్షాలు కురిసినా, పలు ప్రాంతాలు గతంలో మాదిరి నీట మునిగిపోకుండా ఉన్నాయని మంత్రి కేటీఆర్కి అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పనుల పురోగతిని, పూర్తయిన నాలాల నిర్మాణానికి సంబంధించి వివరాలను విసృ్తతంగా జనబాహుళ్యంలోకి తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఫార్ములా ఈ రేసుకి సంబంధించి మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో సమీక్షించారు. ఫార్ములా ఈ కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఫార్ములా నిర్వాహకులతో పాటు, పురపాలకశాఖ హెచ్ఎండీఏ అధికారులు సమన్వయంతో ముందుకుపోతున్నారని, ఫార్ములా ఈ రేసుని, విజయవంతంగా పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.