సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలోనే రూ.200 కోట్లు విడుదల చేయనున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వాస్తవానికి ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్టు. అందుకోసం కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు విడుదల చేస్తుంది. కొనసాగింపుగా మొదలు పెట్టిన ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు కోసం 2021-13 బడ్జెట్లో రూ.816 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.179 కోట్లు విడుదల చేయగా.. మరో రూ.200 కోట్లు కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు ఆర్వీఎన్ఎల్ సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఆలస్యంతో పెరిగినప్రాజెక్టు వ్యయం
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంపై వివక్ష చూపుతూనే ఉంది. అందుకు ముందుకు సాగని ఎంఎంటీఎస్ పనులే కారణమని చెప్పవచ్చు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆలస్యం చేస్తూ.. ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెట్టివేస్తున్నది. ఫలితంగా ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్న విషయాన్ని రైల్వే అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. దీంతో రూ.816 కోట్ల ప్రాజెక్టు వ్యయం రూ.1150కి పెరిగినట్లుగా రైల్వే అధికారులు తెలుపుతున్నారు.
వివిధ దశల్లో ఉన్న పనులు
1.మౌలాలి-ఘట్కేసర్ మధ్య సర్వీసు 12.20 కి.మీటర్ల దూరం. ఈ మార్గంలో విద్యుదీకరణ పనులు నాలుగు రెట్లు పూర్తయ్యాయి.
2.ఫలక్నుమా-ఉందానగర్ 13.5 + 6.5 కిలోమీటర్లు (రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు) డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తి.
3.సికింద్రాబాద్-బొల్లారం మధ్య 14 కి. మీటర్లకు సంబంధించి డబ్లింగ్తో పాటు విద్యుదీకరణ పనులు కొంత భాగం పూర్తి చేశారు. మిగితా పెండింగ్లో ఉంది.
4. బొల్లారం-మేడ్చల్ స్టేషన్ల మధ్య 14 కి.మీటర్ల వరకు డబ్లింగ్తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.
5.సనత్నగర్-మౌలాలి స్టేషన్ల మధ్య 22.10 కి.మీటర్ల మేరకు డబ్లింగ్తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.
6.మౌలాలి-మల్కాజిగిరి-శీతాఫల్మండి స్టేషన్ల మధ్య 10 కిలో మీటర్ల దూరంలో డబ్లింగ్తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది.
7.తెల్లాపూర్ -రామచంద్రపురం స్టేషన్ల మధ్య 5.75 కి.మీ దూరంలో డబ్లింగ్, విద్యుదీకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి..
కొనసాగుతున్న స్టేషన్ల నిర్మాణ పనులు
ఎంఎంటీఎస్ లోకల్ రైలు రెండో దశ ప్రాజెక్టులో భాగంగా.. ఆయా మార్గాల్లో కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మౌలాలి-సనత్నగర్ మార్గంలో.. ఫిరోజ్గూడ, సుచిత్ర సెంటర్, భువ్దేవ్ నగర్, నేరేడ్మెంట్తో పాటు మౌలాలి హెచ్డీ కాలనీ స్టేషన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిగితా మార్గాల్లో మరికొన్ని స్టేషన్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయాల్సి ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.