బేగంపేట్ సెప్టెంబర్ 12: ప్రాంతీయ క్షత్రియ (ఖతి/పట్కర్) సమాజ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విశ్వనాథ్ రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమ వంశ సహస్రార్జున క్షత్రియ ప్రాంతీయ సమాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సర్యసభ్య సమావేశం ఆదివారం సికింద్రాబాద్ ప్యారడైజ్ లయన్స్ భవన్లో నిర్వహించారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ బాలకిషన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సర్వసభ్య సమావేశంలో విశ్వనాథ్ రవీందర్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విశ్వనాథ్ రవీందర్ మాట్లాడుతూ.. యువత ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్ బాలకిషన్ మాట్లాడుతూ.. ఆర్మూర్ ఎంఎల్ఏ జీవన్రెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీందర్ కృషి, సహకారంతో సీఎం కేసీఆర్ ఉప్పల్ వద్ద 30 గుంటల భూమి, రూ.75 లక్షలు మంజూరు చేశారన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంకు విష్ణుతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. సంఘం ఎన్నికల అధికారులుగా చంద్రశేఖర్, రాంకిషన్రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రవీందర్ను సభ్యులు ఘనంగా సత్కరించారు.