కేపీహెచ్బీ కాలనీ, మార్చి 4: ఇండ్లల్లో దొంగతనాలు చేస్తూ.. పోలీసులకు చిక్కి నాలుగుసార్లు జైలుకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి బుద్ధి మార్చుకోలేదు. తాజాగా ఓ దొంగతనం కేసులో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడి వద్ద రూ.2 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. శనివారం కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డీసీపీ టి.శ్రీనివాస్రావు, కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐలు కిషన్కుమార్, నర్సింగరావు వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా క్రోసర్ మండలం కల్లూరి గ్రామానికి చెందిన రాయపాటి వెంకట్రావు (51) నగరంలోని కేపీహెచ్బీ కాలనీ సమీపంలోని నిజాంపేట రోడ్డులో ఉంటూ బిజినెస్ చేస్తున్నాడు. తాగుడు, పేకాటకు బానిసైన వెంకట్రావు సులభంగా డబ్బులు సంపాదించేందుకు హైదరాబాద్కు వచ్చాడు.
2011లో బేగంపేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడి జైలుపాలయ్యాడు. ఆ తరువాత కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లొచ్చాడు. తాజాగా కూకట్పల్లి, ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనాలు, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగతనం చేసి పోలీసులకు చిక్కాడు. అతడి వద్ద రూ.2 లక్షల విలువైన 25.87 గ్రాముల బంగారు, 70.08 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను డీసీపీ అభినందించారు.
ల్యాప్టాప్ దొంగ అరెస్ట్.. 50 ల్యాప్టాప్లు స్వాధీనం
కేపీహెచ్బీ కాలనీ, మార్చి 4: ల్యాప్టాప్లు దొంగిలిస్తూ తప్పించుకొని తిరుగుతున్న వ్యక్తిని కేపీహెచ్బీ కాలనీ పోలీసులు, మాదాపూర్ సీసీఎస్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా హుండీ మండలం, పండువ్వ గ్రామానికి చెందిన మామిడిశెట్టి సత్యాన్వేష్ (27) నిరుద్యోగి. అతడు హైదరాబాద్కు కొచ్చి ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఫుట్పాత్లపై పడుకుంటూ ల్యాప్టాప్లు దొంగతనం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. కేపీహెచ్బీ కాలనీలో అరెస్ట్ చేసి విచారించగా.. 33 కేసుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.21.50 లక్షల విలువైన 50 ల్యాప్టాప్లు, ట్యాబ్, యాపిల్ ఐప్యాడ్, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.