దేశంలోనే మొట్టమొదటి వాటర్ టన్నెల్ ఆక్వేరియం… 5 ఎకరాల్లో అతి పెద్ద పక్షిశాల… ఎత్తయిన రాళ్ల గుట్టల మధ్య 2.5 కి.మీ పొడవునా బోర్డు వాక్… ఇలా ఎన్నో ప్రతిష్టాత్మక అంశాలలో చేపట్టిన ప్రాజెక్టు ఎకో పార్కు. 10, 20 ఎకరాలలో కాదు… ఏకంగా ఒకేచోట 85 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నది. ఒకవైపు జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్సాగర్, మరో వైపు ఔటర్ రింగు రోడ్డు… ఆ రెండింటి మధ్య సుమారు రూ.300 కోట్ల అంచనాతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చేపట్టిన పర్యాటక ప్రాజెక్టు కొత్వాల్గూడ ఎకో పార్కు.
గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.100 కోట్ల వరకు వ్యయం చేసి ఈ ప్రాజెక్టు పనులు సుమారు 30 శాతానికి పైగా పూర్తయ్యాయి. దేశ, విదేశాల పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్న ఏకో పార్కు ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. అధికారంలోకి వచ్చి 2 నెలలు గడిచినా ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి.
– సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హిమాయత్సాగర్, ఔటర్ రింగు రోడ్డు మధ్య ఉన్న 85 ఎకరాల స్థలంలో అద్భుతమైన డిజైన్లతో ల్యాండ్ స్కేపింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ల్యాండ్స్కేపింగ్ పనులు అర్బన్ ఫారెస్ట్రీ విభాగం పూర్తి చేయగా, ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇతర పనులను చేపట్టారు. ఇందులో ప్రధానంగా బోర్డు వాక్, పక్షిశాల, భారీ టన్నెల్ ఆక్వేరియంకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు. ఎత్తయిన కొండలతో కూడిన ప్రాంతంలో అక్కడి సహజ వనరులను ధ్వంసం చేయకుండా నిర్మాణాలను చేపట్టారు. అందులో 2.5 కి.మీ దూరంతో బోర్డు వాక్ను నిర్మాణం పనులు ఇప్పటికే పూర్తి చేశారు.
అదేవిధంగా అతి పెద్ద పక్షిశాల (ఏవియరీ)కి సంబంధించిన ప్రహరీ పనులు చేపట్టారు. ఎకో పార్కులో 4.27 ఎకరాల స్థలంలో ఆక్వా మైరేన్ పార్కు నిర్మాణం ఉంటుంది. ఈ ఆక్వా మైరేన్ పార్కులో బహుళ సంఖ్యలో టన్నెల్స్ను నిర్మించి, అందులో వివిధ రకాల చేపలను ఉంచుతారు. ఇదే ప్రాంతంలో ప్రత్యేకంగా రెస్టారెంటును నిర్మించనున్నారు. అదేవిధంగా డోమ్ థియేటర్, 7డీ థియేటర్, వర్చువల్ అక్వేరియం, టచ్ ట్యాంక్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ కియోస్క్లు ఉంటాయి. ఒకేసారి 2500 మంది సందర్శకులు వీక్షించేలా 2.50లక్షల చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుంది.
వంద మీటరు పొడవుతో వంపు కలిగిన టన్నెల్ 3.5 మీటర్ల వెడల్పుతో నిర్మించి 180 డిగ్రీల కోణంలో గాజు అద్దంలోని నీళ్లలో ఉండే రకరకాలను చేపలను అత్యంత దగ్గర చూసేలా ప్రాజెక్టు డిజైన్ చేశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఎకో పార్కు నిర్మాణం పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం పుల్స్టాప్ పెట్టింది. అత్యంత కీలకమైన ప్రాజెక్టుపై హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఇప్పటి వరకు సమీక్ష చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఎకో పార్కు ప్రాజెక్టు పనులు మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.