కవాడిగూడ, జనవరి 22 : నవగ్రహాల కల్యాణం జరిపించడం వల్ల అన్ని రకాల అరిష్టాలు తొలిగిపోతాయని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరానంద పీఠం ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి ప్రత్యంగిర మహాయాగం రెండవ రోజులో భాగంగా నవగ్రహ కల్యాణంతో పాటు హోమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి భక్తులకు అనుగ్రహం చేశారు. ఈ కార్యక్రమాలలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, రమ్యానంద భారతి స్వామినీ పీఠం కో-ఆర్డినేటర్ మునిపల్లె శ్రీనివాస్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మోచర్ల శశిభూషణ్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.