సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఒక దశాబ్దం తర్వాత భద్రాచలం-సత్తుపల్లి రైల్వే మార్గంలో గూడ్స్ రైల్వే లైన్ ఎట్టకేలకు పూర్తయింది. దీన్ని ఈ నెల 12న దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఇందుకోసం రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ ద్వారా ఉత్పత్తి అయ్యే బొగ్గును దేశంలోని పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేయడంలో భాగంగా సత్తుపల్లి నుంచి భద్రాచలం రోడ్ రైల్వే లైన్కు అనుసంధానం చేశారు. దాదాపు 54 కిలో మీటర్ల మేర సింగిల్ లైన్ వేశారు.
ఈ రైల్వే లైన్ ప్రయాణికుల కోసం కాకుండా సరుకు రవాణా కోసం మాత్రమే నిర్మించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే త్వరలోనే ప్యాసింజర్ రైళ్లను కూడా నడిపించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. దీనికి అదనంగా సత్తుపల్లి-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టు కూడా ప్రారంభం కావాల్సి ఉన్నదని, దీనిపై కేంద్ర, రాష్ట్ర (తెలంగాణ, ఏపీ) ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.