Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): వేగవంతమైన అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా ఐటీ కారిడార్ నిలుస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయతకత్వం ఉండడంతో ఐటీ కారిడార్లో అభివృద్ధి ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టింది. అందుకు తాజా నిదర్శనం. మాదాపూర్-రాయదుర్గం ప్రాంతాల మధ్య ఉన్న నాలెడ్జ్ సిటీయే. ఒకవైపు దుర్గం చెరువు మరోవైపు ఐటీ కంపెనీలకు సంబంధించిన భారీ బహుళ అంతస్తుల భవనాలతో ఆ ప్రాంతమంతా సరికొత్త అందాలకు, అద్భుతాలకు నిలయంగా మారింది.
ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ మహానగరంలోనే ఐటీ కారిడార్ ఆధునీకతకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నది. ఆకాశాన్నంటే బహుళ అంతస్థుల అద్దాల మేడలు నగర రూపు రేఖలను ఒక్కసారిగా మార్చివేస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లను దాటి ఐటీ కారిడార్లో అడుగు పెట్టగానే సరికొత్త నగరం నగర వాసుల కళ్ల ముందు కదలాడుతున్నది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మాదాపూర్ నుంచి ప్రారంభమైన ఐటీ కారిడార్ ప్రస్థానం కోకాపేట దాకా విస్తరించింది. దీంతో మాదాపూర్తో పాటు కొండాపూర్, రాయిదుర్గం, గచ్చిబౌలి, నానక్రాంగూడ,నార్సింగి, పుప్పాల్గూడ, ఫైనాన్సియల్ డిస్ట్రిక్, కోకాపేట దాకా విస్తరిస్తోంది. ఇప్పటిరకు ఐటీ కారిడార్ అంటే… జాతీయ,అంతర్జాతీయ ఐటీ కంపెనీల కార్యాలయాలు, నివాస ప్రాంతాలకు నిలయాలు. అలాంటి ఐటీ కారిడార్ ఇప్పుడు సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. అందుకు తాజా నిదర్శనం ఇటీవల కాలంలో మాదాపూర్ హైటెక్ సిటీ, రాయిదుర్గం నాలెడ్జ్ సిటీలో కొత్తగా ఏర్పాటవుతున్న ఆధునిక వ్యాపార కేంద్రాలు. ముఖ్యంగా టెక్కీల అభిరుచులకు అనుగుణంగా పలు వ్యాపార సంస్థలు కొత్తగా వెలుస్తున్నాయి.
ఐటీ కారిడార్లో ఐటీ కంపెనీల కోసం భూములను సెజ్లుగా మార్చి అభివృద్ధి చేస్తున్నారు. అలా మాదాపూర్లో రహేజా మైండ్ స్పేస్ సెజ్ చాలా పెద్దది. సుమారు 100 ఎకరాలకు పైగా స్థలాన్ని సెజ్గా ఏర్పాటు చేశారు. సరిగ్గా దానికి ఎదురుగా నాలెడ్జ్ సిటీ పేరుతో మరో సెజ్ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసి అందులోని ప్లాట్లను పలు సంస్థలకు కేటాయించింది. అందులోనే తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్ల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ హబ్, టీవర్క్స్ క్యాంపస్లతో పాటు ఇమేజ్ టవర్ నిర్మాణం మొత్తం 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇవే కాకుండా నోవార్టీస్, ఐటీసీ కోహినూర్, పలు ఇతర కంపెనీలకు స్థలాలను కేటాయించడంతో అందులో భారీ బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 9 ఏళ్లలోనే విప్లవాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకోవడంతో ఆ ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా రూపురేఖలే మారిపోయాయి. దుర్గం కేబుల్ బ్రిడ్జి నుంచి మొదలు కొని ఇనార్బిట్ మాల్, ఐటీ సీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, ఐకియా ఉన్న ప్రాంతమంతా ఇప్పుడు ఆధునిక నగరాన్ని తలపిస్తున్నది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో ఇటీవల కాలంలో ఆధునిక వ్యాపార కేంద్రాలు సైతం వెలిశాయి. దీంతో ఐటీ కారిడార్లోని సరికొత్త సంస్కృతి ఆవిష్కృతమవుతున్నది. నగర నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగాల కోసం వచ్చేవారంతా విధులు నిర్వహించి వెళ్లిపోయేవారు. వీకెండ్ వస్తే చాలు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని మాల్స్, మల్టీ ఫ్లెక్సులు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలకు వెళ్లేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోతోంది. ఐటీ కారిడార్లోనే అన్ని ఒక్కొక్కటిగా సమకూరడంతో ఆటవిడుపు కేంద్రంగా మారింది.
నిత్యం ఉద్యోగ విధులకు కోసం నగర నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులు పగటి పూట వచ్చివెళితే, సాయంత్రం వేళల్లో నగర వాసుల సరదాగా ఐటీ కారిడార్కు కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. దుర్గం కేబుల్ బ్రిడ్జి నుంచి మొదలు కొని ఇనార్బిట్ మాల్, ఐటీ సీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ, ఐకియా, శరత్ క్యాపిటల్ మాల్, నానక్రాంగూడ, గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్లో వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు వచ్చి వెళ్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళ్లల్లో ఐటీ కారిడార్లోని భారీ బహుళ అంతస్తుల అద్దాల మేడల్లో వెలిగే దీపాలతో ఈ ప్రాంతమంతా నగర వాసులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఓల్డ్ సిటీ, న్యూ సిటీలోలేనటువంటి భారీ బహుళ అంతస్తుల భవనాలు ఐటీ కారిడార్లో వందల్లో నిర్మాణం జరుపుకోగా, అదే సంఖ్యలో మరిన్ని భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఐటీ కారిడార్ నగర వాసులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారింది.