దుండిగల్, జనవరి 2 : మల్టీ డిసిప్లీనరీ డిగ్రీ (డ్యూయల్ డిగ్రీ)తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని కేఎల్ యూనివర్సీటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే. శ్రీనివాస రావు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి గండిమైసమ్మలోని చైతన్య జూనియర్ కళాశాల (చరక భవన్) విద్యార్థులకు మంగళవారం సాయంత్రం కేఎల్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ – తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత విద్యావకాశాలు అనే అంశంపై ‘లక్ష్యం-2024’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ ప్రిన్సిపాల్ డా.ఎల్.కోటేశ్వర్రావు, నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ జీఎం సురేందర్రావుతో కలిసి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిలుగా హజరయ్యారు.
ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా అడ్మిషన్స్ డైరెక్టర్ డా.జే. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటర్ పూర్తైన తర్వాత ఉన్నత ఉద్యోగావకాశాలకు ఎలాంటి ఉన్నత చదువులు, ఎక్కడ చదవాలి అనే అంశాలపై విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. ఉన్నత చదువులు, మెరుగైన ఉద్యోగావకాశాలను పొందాలనుకునే విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీని ధీమాగా ఎంచుకోవచ్చన్నారు.
ఇంటర్ తర్వాత డిగ్రీని నాలుగేండ్లు కష్టపడి చదివితే ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని 40 ఏండ్లు సుఖంగా బతికే అవకాశాలు ఉంటాయన్నారు. కేఎల్ యూనివర్సిటీలో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో డిగ్రీ (బి.టెక్) చదివే విద్యార్థులకు ఒకేసారి రెండు కోర్సులు(డ్యూయల్ డిగ్రీ) చదివేలా అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ప్రధానంగా బీటెక్ ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎస్ఈ బ్రాంచ్ ఒక్కటే ప్రామాణికం కాదన్నారు.
సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇంజినీరింగ్ చదివే విద్యార్థులు కూడా బీటెక్ రెండవ సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ను చదివి ఉన్నత ఉద్యోగాలు పొందే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ప్రస్తుతం పెద్దపెద్ద ఇండస్ట్రీలలో మల్టీ డిసిప్ల్లీనరీ డిగ్రీ చదివిన వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలా తమ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అత్యధికంగా 60 లక్షల జీతం తీసుకుంటున్న వారూ ఉన్నారని వివరించారు.
అదే విధంగా తమ యూనివర్సిటీలో రెండేండ్లు చదువుకున్న విద్యార్థి మిగతా రెండేండ్లు, మూడేండ్లు చదువుతున్న విద్యార్థి చివరి ఏడాది విదేశాలల్లో తమకు అనుబంధంగా ఉన్న యూనివర్సిటీలో చదువుకునే అవకాశాన్ని కేఏల్ యూనివర్సీటి మాత్రమే కల్పిస్తుందన్నారు. తమ యూనివర్సీటిలో చదివే విద్యార్థులకు ఐదు ఫారెన్ లాంగ్వేజీలను ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు. జేఈఈలో 95 శాతం పర్సంటైల్ సాధించిన వారికి కేఎల్ యూనివర్సిటీలో ఉచితంగా సీటును ఇస్తున్నామన్నారు. కేఎల్ యూనివర్సిటీలో జేఈఈ బేసిక్ ఎగ్జామ్ ఆన్లైన్-ఆఫ్లైన్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చెరకభవన్ బ్రాంచ్ శ్రీచైతన్య కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వీరబాబు, నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ విభాగం ఏజీఎం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం డ్రాలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.
ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థుల కోసం నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికలు, కేఎల్ యూనివర్సిటీతో కలిసి కొంతకాలంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సదస్సులు విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలను తెలియజేస్తుంది. ప్రతి బుధవారం నమస్తే తెలంగాణ పత్రికలో విద్యార్థుల కెరీర్ కోసం భవిత అనే ప్రత్యేక సంచికను అందజేస్తున్నాం. ఈ సంచిక విద్యార్థులు వారి తల్లిదండ్రులకు మార్గదర్శనం చేస్తుంది.
– సురేందర్రావు, నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే అడ్వైర్టెజ్మెంట్ జీఎం
కేఎల్ యూనివర్సిటీకి ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ఈ సంస్థ 43 ఏండ్ల క్రితమే ఆవిర్భవించింది. ఐదేండ్ల క్రితం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ యూనివర్సీటికి నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్ ర్యాంకింగ్లో అద్భుతమైన రికార్డు ఉంది. క్వాలిటీ ప్లేస్మెంట్లతో పాటు విదేశీ యూనివర్సిటీలతో కలిసి పని చేస్తున్నాం. టీ-హబ్తోనూ యూనివర్సిటీకి గొప్ప అనుభందం ఉంది. కేఎల్ యూనివర్సిటిలో చదివే విద్యార్థులకు గొప్ప భవిష్యత్ ఉంటుంది.
– డాక్టర్ ఎల్ కోటేశ్వర్రావు, ప్రిన్సిపాల్, కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్
ఇంటర్ తర్వాత ఉన్న అనేక దారులను కలుపుకొని జీవితంలో ఒక నిర్ధేశిత గమ్యాన్ని చేరేందుకు కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు ఇచ్చిన సెమినార్ ఎంతో నమ్మకం అనిపించింది. తప్పకుండా కేఎల్ యూనివర్సిటీలో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు చక్కటి అవకాశంగా మలుచుకుంటాను.
– సుశాంత్, ఎంపీసీ సెకండియర్
ఉన్నత విద్యావకాశాల కోసం పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ అవగాహన సదస్సుతో భవిష్యత్ ప్రణాళికను రూపొందించుకుంటాను.
– రిషిదీప్,ఎంపీసీ సెకండియర్
కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు ఇచ్చిన అవగాహనతో మా కండ్లముందటే తమ భవిష్యత్ కన్పించింది. కష్టపడి సదివి మంచి ర్యాంక్ సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాను.
– ప్రణవ్,ఎంపీసీ సెకండియర్
కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన సెమినార్ ద్వారా ఇంటర్ తర్వాత నేను ఏం చదువాలో అనే దానిపై ఒక స్పష్టత వచ్చింది. నేను అత్యధిక ప్యాకేజీ పొందే కంపెనీలో స్థానాన్ని దక్కించుకుంటానని నమ్మకంఉంది.
– అభినవ్, ఎంపీసీ సెకండియర్