సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : నామినేషన్ దాఖలు ప్రక్రియ నగరంలో జోరందుకుంది. పార్లమెంట్ స్థానాలకు పోటీ పడుతున్న అభ్యర్థులు తమ మద్ధతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. అందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి సమక్షంలో హైదరాబాద్ లోక్సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా శుక్రవారం సికింద్రాబాద్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. సికింద్రాబాద్ మహంకాలి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆయన.. జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీతో వచ్చారు. నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కిషన్ రెడ్డి వెంట బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఉన్నారు.