మాదాపూర్, నవంబర్ 21: మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుపోయి ఆహారనాళం చిరిగి వారం రోజులుగా వాంతులు చేసుకుంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసి సమస్యను దూరం చేశారు కిమ్స్ వైద్యులు. గచ్చిబౌలికి చెందిన అనిల్ (30) గత కొన్ని రోజులుగా తిన్న వెంటనే ఆగకుండా వాంతులు చేసుకుంటున్నాడు. దీంతో పది రోజుల కిందట ఆతడిని కొండాపూర్లోని కిమ్స్ దవాఖానలో చేర్చారు. సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సీహెచ్ నవీన్ కుమార్ నేతృత్వంలో అనిల్కు పరీక్షలు చేశారు. ఏది తిన్నా…తిన్న వెంటనే ఆగకుండా వాంతులు వస్తున్నాయని దీన్ని బోర్హాన్ సిండ్రోమ్గా వైద్యులు గుర్తించారు.
రోగి ఛాతి భాగంలో ఎడమవైపు తీవ్రమైన నొప్పి ఉండడంతో పాటు ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాడు. ఆహర నాళం దెబ్బతినడంతో పాటు ఆహరం, మాంసం ముక్కలు ఛాతి కావిటీలో పేరుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. మధులికా థొరాకో లాప్రోస్కోపిక్ ద్వారా చికిత్స ప్రారంభించారు. ఆహరనాళం 4 సెంటీమీటర్ల మేర చిరిగిపోయి అందులో మాంసం ముక్కలు పేరుకు పోయి కనిపించాయి. రెండు గంటల పాటు శ్రమించి వైద్యులు వాటిని ఆహారనాళం నుండి తొలగించారు. ఆ తర్వాత ఆహార నాళానికి శస్త్రచికిత్స చేశారు. 16 రోజుల తర్వాత అనిల్ పూర్తిగా కోలుకున్నాడు. కాగా బోర్హాన్ సిండ్రోమ్తో ఆహార నాళం దెబ్బతింంటే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్ నవీన్ కుమార్ వెల్లడించారు. కాగా, సరైన సమయానికి మినిమల్లీ ఇన్వేసివ్ పద్ధతిలో శస్త్రచికిత్స చేయడంతో రోగి త్వరగా కోలుకోగలిగాడని చెప్పారు.