పోలీసులకు దొరుకుతాననే భయంతో బాలుడి అప్పగింత
బంజారాహిల్స్, జూన్ 25: సహజీవనం చేస్తున్న యువతిపై కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకును కిడ్నాప్ చేసిన వ్యవహారం సుఖాంతమైంది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మోతీనగర్లోని బబ్బుగూడకు చెందిన యువతి(24)కి ఇద్దరు పిల్లలు. భర్తతో విడిపోయిన ఆమె.. ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నది. శంకర్ అనే వ్యక్తితో పరిచయమైంది. అతడికి ఇది వరకే వివాహమవ్వగా, భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అతడితో నాలుగు నెలల నుంచి సహజీవనం చేస్తున్న సదరు యువతికి శంకర్ ప్రవర్తన సరిగాలేకపోవడంతో పాటు చోరీ కేసుల్లో అరెస్టయిన విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె రెండేండ్ల కొడుకును శంకర్ తీసుకొని పారిపోయాడు.
పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేయడంతో పట్టుపడడం ఖాయమని భావించిన శంకర్.. శనివారం తెల్లవారుజామున తన తల్లి పద్మను ఎర్రగడ్డకు పిలిపించి.. బాబును ఇవ్వగా, ఆమె జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించింది. బాలుడిని తల్లి చెంతకు చేర్చిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.