సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్ ఆధునికతకు నెలవుగా మారింది. అభివృద్ధి చెందుతున్న ఐటీ కారిడార్లోని ఆయా ప్రాంతాల రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న శివారు ప్రాంతాలు ఊహించని స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయి. దానికి అనుగుణంగా ఓఆర్ఆర్ నుంచి నూతనంగా కల్పిస్తున్న మౌలిక వసతులతో కొత్త ప్రాంతాలకు అనుసంధానం చేస్తున్నారు. తాజాగా ల్యాంకోహిల్స్ నుంచి ఓఆర్ఆర్ వరకు వేసిన లింకు రోడ్డుతో ఖాజాగూడ హిల్స్కు ప్రాధాన్యత వచ్చింది. వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఖాజాగూడ హిల్స్ ఐటీ కారిడార్లో ఆధునిక ఆటవిడుపు కేంద్రంగా మారింది. ఎత్తయిన కొండలు, దానిపై విశాలమైన మైదానం.
ఒక పక్కన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం, మరోచోట సాధువైన మెహర్ బాబా ధ్యానం చేసిన ఒక గుహ… ఇలా అన్నీ కలిసి ఉన్న ఖాజాగూడ హిల్స్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి పడమర భాగమంతా ఎత్తయిన కొండలు, గుట్టలతో కూడుకున్న ప్రాంతాలు ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి మొదలు కొని దుర్గం చెరువు, రాయదుర్గం, ఖాజాగూడ, మణికొండ ల్యాంకోహిల్స్, కోకాపేట, మంచిరేవుల, గండిపేట ప్రాంతాల్లో ఎక్కువగా కొండలతో కూడిన భూ భాగమే ఉంది. ఐటీ కంపెనీల రాకతో ఈ ప్రాంతాల రూపురేఖలు ఒక్కసారిగా మారిపోయాయి. గుట్టలు, కొండలను చీల్చుతూ విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించారు. దీంతో అతి తక్కువ సమయంలోనే ల్యాంకోహిల్స్ ఎదురుగా ఉన్న ఖాజాగూడ హిల్స్కు ఎంతో గుర్తింపు వచ్చింది. నిత్యం నగర వాసులు వందలాది మంది ఇక్కడి గుట్టపై నుంచి ఐటీ కారిడార్లో కనిపిస్తున్న ఆకాశ హర్మ్యాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్కు చెందిన సేవ్ రాక్ సొసైటీ సభ్యులు కొందరు ఈ గుట్టపై సరదాగా పర్వతారోహణం చేయడానికి అప్పుడప్పుడు వస్తుంటారు. ఇక్కడి రాతి సంపద గురించి ప్రచారం చేస్తూ, దాన్ని పరిరక్షించాలంటూ సందర్శకులు వివరిస్తూ ఉంటారు. అత్యంత ఎత్తయిన కొండ ప్రాంతం కావడంతో కొంత మంది కేవలం ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తుంటారు. చాలా పెద్ద బండ రాళ్లను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తుంటే రాక్ సొసైటీ సభ్యులు అడ్డుకొని, వాటిని పరిరక్షించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అలా ఖాజాగూడ కొండపై ఉన్న బండరాళ్లను రక్షిస్తూ పర్యాటక ప్రదేశంగా ఉండేందుకు సేవ్ రాక్ సొసైటీ బృందం కృషి చేస్తోంది.
ఐటీ కారిడార్లోనే అత్యంత ఎత్తయిన గుట్ట ప్రాంతంగా గుర్తింపు పొందింది. వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ గుట్టను హెచ్ఎండీఏ ప్రత్యేకంగా నిధులు వెచ్చించి పలు మౌలిక వసతులు కల్పించింది. ఫక్రుద్దీన్ గుట్టగా ప్రసిద్ధి చెందిన ఖాజాగూడ గుట్టపై ఉన్న రాతి సంపదను పరిరక్షించే చర్యలను చేపట్టింది. రాక్ సొసైటీ ప్రతినిధులు సైతం ఈ ప్రాంతాన్ని తరచూ సందర్శిస్తూ నగరంలోనే ఈ గుట్టపై ఉన్న సహజ సిద్ధమైన రాతి నిర్మాణాల గురించి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కొండ పైకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో సందర్శకుల తాకిడి తక్కువగా ఉండేది.
హెచ్ఎండీఏ చేపట్టిన పరిరక్షణ చర్యలతో ల్యాంక్హిల్స్ నుంచి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెళ్లే మార్గం నుంచి వచ్చేందుకు దారిని ఏర్పాటు చేయగా, ఇటీవల కాలంలో ల్యాంకోహిల్స్ ఓఆర్ఆర్ వరకు వేసిన లింకు రోడ్డు 39తో విశాలమైన రహదారి గుట్ట పక్క నుంచే వచ్చింది. దీంతో ఖాజాగూడ గుట్ట నిత్యం సందర్శకులతో సందడిగా మారుతోంది. మరో ప్రత్యేక ఆకర్షణగా గుట్ట పై చూడగానే పెద్ద చెరువు నిండుగా నీటిని కనిపిస్తుండటం అక్కడి వారిని ఆకట్టుకుంటోంది. అక్కడ చూస్తే భారీ ఎత్తయిన బహుళ అంతస్థుల భవనాలకు తోడు 4,6, వరసలతో కూడిన రోడ్డు, ఓఆర్ఆర్ చుట్టూ కొత్తగా జరుగుతున్న నిర్మాణాలు చూపరులను ఆకట్టుకునేలా చేస్తోంది. గుట్టపై ఉన్న 800 ఏళ్ల నాటి పురాతన ఆలయమైన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయాన్ని కొందరు సందర్శిస్తుంటే.. మరికొందరు అక్కడే ఉన్న సాధువైన మెహర్ బాబా ధ్యానం చేసిన ఒక గుహను సైతం సందర్శిస్తూ దాని ప్రత్యేకతలను తెలుసుకుంటున్నారు. చుట్టు పక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఖాజాగూడ గుట్ట ప్రాంతం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు దక్కించుకుంటోంది.