బంజారాహిల్స్,జనవరి 12: కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యాహక్కు చట్టం కింద 25శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాల్సిందేనని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. గురువారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్స్తో సహా పలు ప్రముఖ స్కూళ్లలో 25శాతం సీట్లను స్థానికంగా ఉన్న పేద విద్యార్థులకు కేటాయించాలనే నిబంధనలున్నాయన్నారు.
అయితే ఆయా స్కూళ్ల యాజమానులు ఈ సీట్లను వేరేవాళ్లకు ఇస్తుండటంతో మంచి స్కూళ్లలో చదువుకోవాలన్న ఆశ పేద విద్యార్థులు వదులుకోవాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గానికి చెందిన అనేక మంది విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చి ఈ సమస్యలపై ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆయా స్కూళ్లలో 25శాతం సీట్లను కేటాయించాలని, లేకుంటే ఆయా స్కూళ్లవద్ద ఆందోళనలు చేస్తామన్నారు. శాసనసభలో కూడా ఈ సమస్య గురించి చర్చకు తీసుకువస్తామన్నారు.