బంజారాహిల్స్,అక్టోబర్ 17: తెలంగాణ ప్రజలకు గత పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందిస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ను మించిన గ్యారంటీ మరేదీ లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ప్రభుత్వం తరపున వచ్చిన అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాలు అందుకున్న తల్లిదండ్రుల ముఖాల్లో కనిపించిన సంతోషానికి మించిన గ్యారంటీలు ఏమున్నాయన్నారు.
పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ కిట్స్, పౌష్టికాహారం అందించి మానవత్వాన్ని చాటుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను మించిన గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మరేదీ లేదన్నారు. గురుకుల పాఠశాలల ఏర్పాటు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం, ఉచిత మంచినీటి సరఫరా, గృహలక్ష్మి, దళితబంధు లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి గ్యారంటీగా గెలిపించి తీరుతారన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికో విధానం అమలు పరుస్తూ మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. తెలంగాణలో ఓట్లు అడగడానికి ముందు తాము పాలిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను ప్రజలకు అందించడం ఖాయమని ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విపరీతంగా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వారిపై భారం తగ్గించేందుకు రూ.400కే గ్యాస్ సిలిండర్ను అందించాలని నిర్ణయించారన్నారు. అర్హులైన పేద మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేలు అందిస్తామన్నారు. కేసీఆర్ ఆరోగ్యరక్ష పథకం కింద రూ. 15లక్షల ఆరోగ్య భీమా అందిస్తామని,రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రూ.5లక్షల జీవిత బీమా అందిస్తుందన్నారు.
తెల్లకార్డుదారులందరికీ రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందిస్తామని, అసరా పించన్లను రూ.3016కు పెంచడంతో పాటు ప్రతియేటా రూ.500చొప్పున పెంచుతామన్నారు. మహిళా సమాఖ్యలకు సొంతభవనాలను నిర్మించి ఇస్తామని, అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. గురువారం నుంచి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నామని, బూత్స్థాయిలో స్థానిక కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారన్నారు.