బంజారాహిల్స్,అక్టోబర్ 28: ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చేసే జిమ్మిక్కులు, మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం.14లోని ఓల్డ్ వెంకటేశ్వనగర్ బస్తీకి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బస్తీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీలకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకువస్తారని, అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం ఏమీ చేయని పార్టీలు ఎన్నికలు వస్తున్నాయంటే ఊసరవెళ్లిలా రంగులు మారుస్తూ.. వస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని రంగులతో వచ్చినా తెలంగాణలోని పేద ప్రజలంతా గులాబీ జెండా నీడనే కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన వారు చేసిందేమీ లేదని, ఇప్పుడు మరోసారి వచ్చి ఒక్క చాన్స్ అంటూ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పేదల మద్దతుతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, బీఆర్ఎస్ నాయకులు పీరన్సాబ్,జావెద్, శ్రీధర్, బరిగెల వెంకటస్వామి, బాబానాయక్, రాజు, రాజేశ్, అరిఫ్, కిశోర్, రమేశ్, వెంకటేశ్, ఫారూక్ పాల్గొన్నారు.