చార్మినార్, సెప్టెంబర్ 22: ఖడ్గ మృగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ జులాజికల్ పార్క్లో శుక్రవారం జంతు జాలం,వాటి స్థితిగతులపై జూ అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఖడ్గమృగాల అలవాట్లు, వాటి జీవన విధానంపై వక్తృత్వ పోటీలను నిర్వహించగా.. బేగంపేట్ – దేవన బ్లైండ్ స్కూల్కు చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఖడ్గ మృగం, ఏనుగుల దత్తత అంతర్జాతీయ ఖడ్గ మృగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ ఆయిల్ కంపెనీ నిర్వాహకులు ఏడాది పాటు ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కు చెందిన 20 మంది అధికారులు శుక్రవారం జూ పార్క్ను సందర్శించారు.
అనంతరం జూ పార్క్ క్యూరేటర్ సునీల్ ఎస్.హిరేమంత్తో సమావేశమైయ్యారు. ఖడ్గ మృగం దత్తతపై చర్చించి, ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. సింగరేణి కాలరీస్కు చెందిన కృష్ణమూర్తి నెలరోజుల పాటు ఏనుగును దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన ఖర్చుల మొత్తాన్ని క్యూరేటర్కు అందించారు. ఈ కార్యక్రమంలో జూ డైరెక్టర్ విఎస్ఎన్వీ ప్రసాద్తో పాటు క్యూరేటర్ సునీల్ ఎస్ హిరేమంత్, డిప్యూటీ క్యూరేటర్ నాగమణి,అసిస్టెంట్ క్యూరేటర్ శ్రీదేవి, ప్రజా సంబంధాల అధికారి హనీఫుల్లాతో పాటు డబ్యుడబ్యుఎప్ అధికారి ఫరీదా తంపాల్ పాల్గొన్నారు.